హర్యానా, కశ్మీర్ లో బీజేపీకి ఎదురుగాలి.. ?
పదేళ్ల బీజేపీ పాలనకు గండిపడనుందా..? హర్యానా ప్రజలు హస్తానికే మొగ్గుచూపుతున్నారా...? అవును.. సర్వేలన్నీ అవే చెబుతున్నాయి. బీజేపీ-కాంగ్రెస్ ముఖాముఖి తలపడిన హరియాణాలో కాంగ్రెస్ కే ఆధిక్యం దక్కనున్నట్లు మొత్తం 8 ఎగ్జిట్ పోల్స్లోనూ తేలింది. వరుసగా రెండుసార్లు హర్యానాలో అధికారం చేపట్టిన కమలానికి ఈ సారి గెలుపు అందని ద్రాక్షనే అని స్పష్టం చేశాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 45 శాతం, బీజేపీకి 38, ఐఎన్ఎల్డీ, బీఎస్పీ కూటమికి 5.2, ఆప్నకు 1 శాతం, జేజేపీకి 1 శాతంలోపు ఇతరులకు 10 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 7 ఎగ్జిట్ పోల్స్కు గాను సగటున కాంగ్రెస్ 55 సీట్లు రానున్నాయి. మెజారిటీ మార్క్ 46 కంటే ఇవి 9 అధికం.
సీఎం పదవికి కాంగి‘రేసు’
హర్యానా సీఎంగా సీఎల్పీ నాయకుడు భూపీందర్కు 39%, కాంగ్రెస్ ఎంపీ కుమారీ షెల్జాకు 10%, సిట్టింగ్ బీజేపీ సీఎం సైనీకి 28%, కేంద్ర మంత్రి ఖట్టర్కు 6 శాతం మంది మద్దతిస్తున్నారని పీపుల్స్పల్స్ వెల్లడించింది. ఓటర్లు స్థానిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారని, మోడీ ప్రభావం కనిపించలేదని తెలిపింది. రైతు ఉద్యమాలు, అగ్నివీర్, రెజర్ల ఆందోళనలు బీజేపీకి ప్రతికూలంగా మారినట్లు పేర్కొంది. కాగా, కాంగ్రెస్ గెలుపు ఖాయమని తెలుస్తుండడంతో సీఎం పదవికి షెల్జా, సూర్జేవాలా, భూపిందర్ వర్గాల మధ్య పోటీ పెరిగింది.
కశ్మీరంలో హంగ్..?
90 సీట్లున్న కశ్మీర్లో హంగ్ తప్పదని, బీజేపీకి సగటున 27 సీట్లే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఎన్సీ 29%, కాంగ్రెస్ 14%, బీజేపీ 24%, పీడీపీ 16%, ఏఐపీ 5%, ఇతరులు 12% ఓట్లు దక్కించుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఎన్సీ-కాంగ్రెస్ కూటమికి 43% ఓట్లు వస్తాయని అంచనా వేసింది.