బాగా పనిచేస్తున్న రాష్ట్రాలకు.. కేంద్ర నిధుల్లో అన్యాయం
మంచి పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. 16వ ఆర్థిక సంఘం సమావేశం అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. బాగున్న రాష్ట్రానికి నిధులు తక్కువ ఇస్తామనటం అన్యాయమని, బాగా పనిచేస్తున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించేలా విధానాలు ఉండాలని, వాటి గొంతు నొక్కవద్దని ఆర్థిక సంఘాన్ని కోరినట్లు తెలిపారు. పన్నుల వాటా కేటాయింపులో కేంద్రం పాటిస్తున్న విధానాలు సరిగా లేవన్నారు. ఇంటింటికి నీరు కోసం కేంద్రం హర్ ఘర్ జల్ పథకాన్ని తీసుకొచ్చింది. కానీ, దాన్ని రాష్ట్రంలో మిషన్ భగీరథ రూపంలో గతంలోనే అమలు చేశాం. మిషన్ భగీరథ పథకానికి నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా నిధులు ఇవ్వలేదు. 15వ ఆర్థిక సంఘం సూచనల్లో ఒక్కదాన్ని కూడా కేంద్రం పాటించలేదు. తెలంగాణ పట్ల కేంద్రం ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరిస్తోంది అని విమర్శించారు.