హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్.. లండన్ వెళ్లేందుకు
లండన్ వెళ్లేందుకు ఎన్ఓసీ ఇవ్వాలని ఆదేశించాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిపింది. జగన్ లండన్ టూర్కు సీబీఐ కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చిందని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ప్రజాప్రతినిధుల కోర్టు షరతులు విధించిందని హైకోర్టుకు తెలిపారు. ఈ విధంగా షరతులు విధించడం సరికాదన్నారు. ఎన్వోసీ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఈ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ నెల 3 నుంచి 25 వరకు లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు జగన్కు అనుమతి ఇవ్వగా, విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న పెండింగ్ కేసుపై ఎన్వోసీ తీసుకోవాలంటూ ఇటీవల పాస్పోర్టు కార్యాలయం జగన్కు లేఖ రాసింది. ఎన్వోసీ కోసం ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం షరతులు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ షరతులపై జగన్ హైకోర్టును ఆశ్రయించారు.