అమెరికాతో డిఫెన్స్ డీల్.. ప్రిడేటర్లు వచ్చేస్తున్నాయి
భారత ప్రాదేశిక భద్రతలో హిందూ మహాసముద్రం చాలా కీలకం. గత కొన్నేళ్లుగా ఈ మార్గంలో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు చైనా చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలి కాలంలో చైనా యుద్ధ నౌకలు తరచుగా హిందూ మహాసముద్రంలో ప్రవేశిస్తున్నాయి. దీంతో ఈప్రాంతంలో దేశ భద్రతపై కేంద్రం ఫోకస్ పెట్టింది. హిందూ మహాసముద్రంపై డేగ కన్ను వేసేందుకు భారత్ కీలక డ్రోన్లు కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. నిఘా కార్యకలాపాలకు ఉపయోగించే అత్యంత సమర్థవంతమైన ప్రిడేటర్ డ్రోన్లను సమకూర్చుకోవాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం... ఈ దిశగా కీలక ముందడుగు వేసింది.
ఈ 31 ప్రిడేటర్ ఎంక్యూ 9బీ డ్రోన్ల కొనుగోలు కోసం రూ.32 వేల కోట్లతో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై రెండు దేశాల మధ్య సంతకాలు జరిగాయి. ఈ 31 ప్రిడేటర్ ఎంక్యూ 9బీ డ్రోన్లలో భారత నేవీకి 15, ఆర్మీకి 8, వాయుసేనకు 8 అప్పగించనున్నారు. ఈ డ్రోన్ల సాయంతో హిందూ మహాసముద్రంపై భారత నిఘా శక్తి మరింత పెరగనుంది. ప్రిడేటర్ డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధరంగాల్లో నమ్మకమైన మానవ రహిత నిఘా విమానాలుగా పేరుపొందాయి. వీటిని అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ సంస్థ తయారుచేస్తోంది. ఇటీవల ప్రధాని మోడీ.. అమెరికా పర్యటన సందర్భంగా ఈ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం ఖరారైంది.