యుద్ధరంగంలో నిఘా రారాజు ప్రిడేటర్ డ్రోన్స్..
ఓ వైపు డ్రాగన్ దుందుడుకు చర్యలు.. మరోవైపు దాయాది పాకిస్తాన్ కుటిలయత్నాలను ఎదుర్కొనేందుకు కేంద్రం , అమెరికాతో ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఇది మనతీర గస్తీకి చాలా ఉపయోగమని కేంద్రం చెబుతోంది.దీనివల్ల సరిహద్దుల్లో చైనా దళాల కదలికలను గుర్తించడంతో పాటు అవసరమైన పక్షంలో దాడికూడా సులభమవుతుంది. ప్రిడేటర్ డ్రోన్స్.. ఇవి ఇరువైపులా పదునైన కత్తిలాంటివి. నిఘా కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించడంతో పాటు శత్రువును గుర్తించి కచ్చితంగా దాడి చేయగలవు.
వాస్తవంగా చూస్తే యుద్ధక్షేత్రాల్లో ఇంటెలిజెన్స్ సమాచారం చాలా కీలకం. ఇది శత్రువులపై దాడి చేయడంతో పాటు ఆధిపత్యాన్ని అందించగలదు. ఇది భారత్ కు సముద్రంతో పాటు హిమాలయసానువుల్లోనూ ఆధిపత్యాన్ని అందిస్తుందన్నది నిపుణుల మాట. చైనాకు చియా హంగ్-4, వింగ్ లుంగ్-2, పాకిస్తాన్ దగ్గర షాపహర్ -2, వింగ్ లుంగ్-2 లాంటి డ్రోన్లు ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ మన దగ్గర ఆస్థాయి డ్రోన్లు లేవు.కాని ప్రిడేటర్ల రాకతో ఎల్ఓసీ, ఎల్ఏసీ దగ్గర పరిస్థితుల్లో మార్పు కచ్చితంగా కనిపించనుంది.
ఇవి సరిహద్దుల్లో శత్రు సైన్యాల మోహరింపు నుంచి విమాన కదలికలు, రాకెట్స్ సహా అన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించగలవు.అత్యవసర సమయాల్లో శత్రువులపై దాడి చేసి తప్పించుకుని రాగలవు కూడా. ఇప్పటికే ఇందులో ఓరకమైన రెండు స్కై గార్డియన్ డ్రోన్లను భారత్... అమెరికాలోని జనరల్ అటామిక్స్ సంస్థ నుంచి భారత్ లీజుకు తీసుకుంది.తూర్పు లడాఖ్ లో చైనా దుందుడుకు చర్యల సమయంలో.. ఈడ్రోన్లు చాలా ప్రయోజనకరమైన సేవలందించాయి. సరిహద్దు వెంబడి చాలా క్లారిటీతో ఫొటోలు అందించాయి.
ఈ డ్రోన్లు సుదీర్ఘ సమయం గగనతలంలో సేవలందించగలవు. 50 వేల అడుగుల ఎత్తులో 35 గంటల పాటు విహరించగలవు. గంటకు 442 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 1700 కిలోల పేలోడ్, 450 కిలోల బరువున్న బాంబులను తీసుకెళ్లగలవు.ఈ డీల్ లో 170 వరకూ క్షిపణులు భారత్ కు అందనున్నాయి.. ఇప్పటివరకూ ప్రిడేటర్లను ఆస్ట్రేలియా, ఫ్రాాన్స్, నెదర్లాండ్స్, ఇటలీ, స్పెయిన్, యూకే వాడుతున్నాయి. లేటెస్టుగా భారత్ కూడా వీటి సరసన చేరింది.