ఉక్రెయిన్ లో మోడీ పర్యటన ఖరారు...
రష్యా దండయాత్రతో గత రెండేళ్లకు పైగా యుద్ధ భూమిలో నలిగిపోతున్న ఉక్రెయిన్లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటించనున్నారు. వచ్చే నెలలో ఆయన కీవ్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 23న మోడీ.. ఉక్రెయిన్కు వెళ్లి ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తో భేటీ కానున్నట్లు సమాచారం. 2022లో ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టిన తర్వాత ప్రధాని మోడీ కీవ్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.
ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోడీ, జెలెన్స్కీ భేటీ అయ్యారు. అంతకుముందు భారత్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన మోడీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. తీరిక చేసుకొని ఉక్రెయిన్లో పర్యటించాల్సిందిగా మోడీని ఆయన కోరారు. ఈ క్రమంలోనే భారత ప్రధాని కీవ్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈనెల ఆరంభంలో ప్రధాని మోడీ రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు సాగిన ఆ పర్యటనలో ఆ దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ఈసందర్భంగా వీరిద్దరూ ఆలింగనం చేసుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీనిపై జెలెన్స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ పరిణామాలు తీవ్ర నిరాశ కలిగించాయని అన్నారు. అయితే ఆ వ్యాఖ్యలను భారత విదేశాంగశాఖ ఖండించింది. తమ విధానాలు సర్వస్వతంత్రంగా ఉంటాయని... ఏదేశాన్ని దృష్టిలో పెట్టుకుని జరగవన్నారు విదేశాంగశాఖ ప్రతినిధులు. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం ప్రవర్తిస్తుందని తేల్చి చెప్పారు.