తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు..
హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్..
వినాయక చవితి నాడు తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి.
కీలక స్థానాల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తూ రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ పైన ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.
కేసీఆర్ హయాంలో హైదరాబాద్ సీపీగా పని చేసిన సీవీ ఆనంద్ ను తిరిగి రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా నియమించింది.
ఇప్పుడు ఈ నిర్ణయం సంచలనంగా మారింది. అదే విధంగా పలు కీలక హోదాల్లోని అధికారులను మార్పు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం అయిదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
హైదరాబాద్ ప్రస్తుత పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డిని బదిలీ చేసింది. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఏరి కోరి ఎంపిక చేసారు.
అయితే, ఇప్పుడు ఆయన పైన బదిలీ వేటు చర్చనీయాంశంగా మారుతోంది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీవీ ఆనంద్ ను రాష్ట్రానికి రప్పించి హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా నాడు నియమించారు.
తాజా ఉత్తర్వుల్లో ప్రస్తుత నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డికి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా నియమించారు.
అదే విధంగా ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు.
త్వరలోనే మరి కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని సమాచారం.
- జి.సురేందర్, భూవిజన్ న్యూస్