జగన్ తగ్గడం పవన్ కు ప్లస్.. బాబుకి మైనస్ అయ్యే అవకాశం ఉందా..
2024 ఎన్నికల తరువాత ఆంధ్రాలో రాజకీయం పూర్తిగా మారినట్లు కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో గెలవడానికి కూటమిగా ఏర్పడి టీడీపీ, బీజేపీ, జనసేన ఒకటిగా బరిలోకి దిగాయి. అయితే రాజకీయంలో ఎవరు శాశ్వతమైన మిత్రులు, శత్రువులు ఉండరు. ఈరోజు ఉన్న రాజకీయం రేపు ఉంటుంది అన్న నమ్మకం కూడా ఉండదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ క్రమంగా క్షీణిస్తోంది.. అయితే ఇది బాబుకి భవిష్యత్తులో పెను సవాలుగా మారే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
వైసీపీ ను ఓడించడం కోసం.. జగన్ ను పదవి నుంచి దించడం కోసం ఈ మూడు పార్టీలు కూటమి కట్టాయి. ఇక ఈ మూడు పార్టీల లోపల లొసుగులు అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు వైసీపీ నుంచి వలసలు తీవ్రంగా ఉన్నాయి. అయితే వైసీపీ లో వస్తున్న చీలికలు ఆ పార్టీని బలహీనపరిస్తే.. పవన్ ను బలపరుస్తున్నాయి అన్న వాదన గట్టిగా వినిపిస్తుంది. ఈరోజు టీడీపీ గెలిచింది అంటే చంద్రబాబుతో పాటు సరి సమానమైన పాత్ర పవన్ పోషించాడు అనడంలో డౌట్ లేదు. రేపు 2029కి కూటమిలో కుంపట్లు రావు అన్న గ్యారంటీ లేదు. ఈరోజు ఆంధ్రాలో కనిపిస్తున్న పరిస్థితులు 2029 ఎన్నికలలో ఎటువంటి మార్పులు తీసుకువస్తాయో ఎవరు అంచనా వేయలేకపోతున్నారు.
వైసీపీ లో నాయకులకు తమ పార్టీ పట్ల ఎమోషనల్ గా ఎటువంటి బాండింగ్ లేదు అన్న విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ పరిస్థితి అయిపోయినట్లే అంటున్నారు కొందరు.అయితే వైసీపీ నుంచి టీడీపీ లోకి వస్తున్న నాయకులు ప్రజల కోసం రావడం లేదు.. పదవుల కోసం మాత్రమే వస్తున్నారు. వారు ఆశించిన గుర్తింపు దక్కకపోతే తిరిగి మళ్ళీ వారు జనసేన వైపు చూస్తారు. జనసేన ప్రస్తుతం గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో కూడా మంచి పట్టు సాధించింది. ఇక కృష్ణ, గుంటూరు ప్రాంతాలలో కూడా మెల్లిగా పవన్ తన పవర్ పెంచుకుంటున్నారు.ఈ నేపథ్యంలో రాజకీయంగా వైసీపీ ఎంత తగ్గితే పవన్ అంత పవర్ ఫుల్ గా మారుతాడు. ఒకవేళ అదే జరిగితే 2029 నాటికి కూటమి పొత్తుల లెక్కలు తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. చంద్రబాబు ఇది గమనించుకొని జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో వాటి పరిణామాలు లోకేష్ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు విశ్లేషకులు.