భారత్-చైనా మధ్య వివాదంలో తొలి అడుగు పడినట్లేనా..?
భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత కొన్నేళ్లుగా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.గాల్వన్ ఘటన తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. దీనిపై ఇరుదేశాల దౌత్యాధికారులు, సైనిక వర్గాలు తరచూ సంప్రదింపులు జరుపుతున్నా ఇప్పటివరకూ పెద్దగా ఫలితాలు కనిపించలేదు. అయితే లేటెస్టుగా ఇరుదేశాల మధ్య చర్చల్లో కీలక పురోగతి కనిపించింది.దీనిపై ఇరుదేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్ను పునరుద్ధరించాలని ఇండియా-చైనా (India-China) నిర్ణయించినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి తెలిపారు.
కొన్ని వారాలుగా దౌత్య, సైనిక స్థాయిలో భారతదేశం-చైనా మధ్య జరుగుతున్న చర్చల్లో ఓ అవగాహనకు వచ్చినట్లు తెలిపారు మిశ్రి. ఫలితంగా ఎల్ఓసీ వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఒక అవగాహన కుదిరిందన్నారు. బలగాల ఉపసంహరణ, పరిస్థితిని చక్కదిద్దేందుకు పెట్రోలింగ్ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రష్యాలో బ్రిక్స్ సదస్సుకు ప్రధానమంత్రి మోడీ హాజరైన నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, చైనా ప్రధాని జిన్పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశాలు ..దీంతో మెరుగుపడ్డాయని చెప్పొచ్చు.
తూర్పు లడఖ్ సరిహద్దుల్లో 2020లో చైనా, భారత్ బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అప్పటి ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, చైనా వైపు నుంచి కూడా పలువురు సైనికులు మరణించారు. తాత్కాలికంగా బలగాలు వెనక్కి వెళ్లినప్పటికీ, రెండు పొరుగుదేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సరిహద్దు సమస్యల పరిష్కారానికి కొన్ని వారులుగా భారత్-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయి.