బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి (52) కన్నుమూశారు. శుక్రవారం ఉదయానికి ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారింది. పరిస్థితి చేజారడంతో కుటుంబసభ్యులు బాలకృష్ణారెడ్డి స్వస్థలం భువనగిరికి తీసుకొస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచారు. జిట్టా బాలకృష్ణారెడ్డి యువజన సంఘాల నేతగా సేవా కార్యక్రమాలతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్, యువ తెలంగాణ పార్టీ, కాంగ్రెస్, బీజేపీల్లో వివిధ హోదాల్లో పని చేశారు. చివరికి ఇటీవల మళ్లీ బీఆర్ఎస్లో తిరిగి చేరారు. భువనగిరి నియోజకవర్గంలో రెండు దశాబ్దాల పాటు ఆయన అవిశ్రాంతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక సమస్యలపై పోరాటాలు చేశారు. మూసీ ప్రకాళన కోసం పాదయాత్ర చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసుకున్నారు. పార్థివదేహాన్ని భువనగిరి శివారులోని ముగ్గంపల్లి రోడ్డులో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి తీసుకొచ్చారు.