కమల్ కోపం ఇంకా ఎన్నేళ్లు?
కమల్ హాసన్ మధ్యలో కొన్నేళ్ల పాటూ సినిమలాకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇండియన్2 తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు కానీ సగం షూటింగ్ కూడా పూర్తయ్యాక ఆ సినిమాకు ఊహించని విధంగా బ్రేక్ పడింది. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్ లో క్రేన్ ప్రమాదం జరగడంతో కొంతమంది ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారు.ఆ ప్రమాదం తమిళ సినీ పరిశ్రమను ఎంతగానో కుదిపేసింది. ఆ దెబ్బతో ఇండియన్2కు బ్రేక్ పడింది. షూటింగ్ టైమ్ లో భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్ల కమల్ హాసన్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పై ఎంతో ఫైర్ అయ్యాడని వార్తలొచ్చాయి. మీడియా ముందు కూడా కమల్ ఈ విషయంలో వాళ్లపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ఆయన కోపం ఏ స్థాయికి వెళ్లిందంటే రెండేళ్ల వరకు ఆ సినిమాను తిరిగి ప్రారంభించనంత. దీంతో విక్రమ్ సినిమాతో కమల్ రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అవడంతో ఆగిపోయిన ఇండియన్2ను తిరిగి పట్టాలెక్కించాడు. సినిమా పూర్తయి రిలీజ్ కు రెడీ అయినా, కమల్ కు ఇప్పటికీ నిర్మాతల మీద కోపం తగ్గినట్లు లేదు. రీసెంట్ గా ఇండియన్2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దాదాపు 15 నిమిషాల పాటూ మాట్లాడిన కమల్, మాట వరుసకు కూడా లైకా ప్రొడక్షన్ గురించి కానీ నిర్మాతల గురించి కానీ మాట్లాడలేదు. దీన్ని బట్టి చూస్తుంటే క్రేన్ యాక్సిడెంట్ విషయంలో కమల్ కు ఆ నిర్మాతల మీద ఇంకా కోపం తగ్గలేదనిపిస్తుంది.