బ్రిటన్ కొత్త ప్రధాని కీవ్ స్టార్మర్...
![బ్రిటన్ కొత్త ప్రధాని కీవ్ స్టార్మర్...](https://www.telugutimes.net/storage/news/news_new_75509.jpg)
పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయంతో.. యూకే తదుపరి ప్రధానిగా కీర్ స్టార్మర్ నియమితులయ్యారు. కింగ్ ఛార్లెస్-3 ఆయన నియామకాన్ని ఆమోదించారు. ఫలితాల అనంతరం స్టార్మర్.. బకింగ్హామ్ ప్యాలెస్లో రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేయాలని ఆయన్ను ఆహ్వానించారు. ఈ భేటీకి సంబంధించిన చిత్రాన్ని రాజ కుటుంబం ఎక్స్ వేదికగా షేర్ చేసింది. రాజును కలిసిన తర్వాత నూతన ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశానికి మొదటి ప్రాధాన్యమని, తర్వాతే పార్టీ అని స్పష్టం చేశారు. ప్రజాసేవ ఒక గౌరవం అని వ్యాఖ్యానించారు. శుక్రవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్లో లేబర్ పార్టీ నాలుగు వందలకు పైగా సీట్లు దక్కించుకోగా.. కన్జర్వేటివ్ పార్టీ 120 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఇక దీనికి ముందు రిషి సునాక్.. ప్రధాని అధికార నివాసం ముందు చివరి ప్రసంగం చేసి, రాజును కలిసి రాజీనామా సమర్పించారు.
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అక్కడి పార్లమెంటు దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్లో భారత సంతతి హవా కొనసాగింది. దాదాపు 26 మంది భారత మూలాలున్న అభ్యర్థులు అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొందిన భారత సంతతి అభ్యర్థుల్లో రిషి సునాక్ ముందున్నారు. రిచ్మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్ స్థానం నుంచి ఆయన మరోసారి గెలుపొందారు. మాజీ హోంమంత్రులు సుయెల్లా బ్రేవర్మన్, ప్రీతి పటేల్లు తమ స్థానాలను పదిలంగా ఉంచుకోగలిగారు. భారత సంతతికి చెందిన క్లెయిర్ కౌటిన్హో కూడా విజయం సాధించారు. సౌత్వెస్ట్ హెర్ట్ఫోర్డ్షైర్ నుంచి కన్జర్వేటివ్ నేత గగన్ మొహీంద్ర, లైసెస్టర్ ఈస్ట్ నుంచి శివాని రాజా గెలుపొందారు. లేబర్ పార్టీకి చెందిన రాజేశ్ అగర్వాల్పై శివాని విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన శైలేష్ వారా, తొలిసారి పోటీలో దిగిన అమీత్ జోగియాలు స్వల్ప తేడాతో ఓటమి చెందారు.
లేబర్ పార్టీ నుంచి..
మొత్తంగా లేబర్ పార్టీ నుంచే భారత సంతతి అభ్యర్థులు అధిక సంఖ్యలో బ్రిటన్ పార్లమెంటులో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. వీరిలో సీమా మల్హోత్రా (వాల్సాల్ నియోజకవర్గం), వాలెరీ వాజ్ (బ్లోక్స్విచ్).. ఆమె సోదరి కీత్ వాజ్, లీసా నాండీ (విగాన్)లు భారీ మెజార్టీతో గెలుపొందారు. బ్రిటిష్ సిక్కు ఎంపీలు ప్రీత్ కౌర్ గిల్, తన్మంజిత్ సింగ్ ధేహిలు మరోసారి విజయం సాధించారు. నావెందు మిశ్రా, రదిమా విటోమ్లు లేబర్పార్టీ నుంచి భారీ మెజార్టీతో తమ స్థానాలను పదిలపరచుకున్నారు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 పార్లమెంటు స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్కు 326 సీట్లు కాగా లేబర్ పార్టీ 410 స్థానాల్లో గెలుపొందింది. కన్జర్వేటివ్లు కేవలం 118 చోట్ల విజయం సాధించారు. రిషి సునాక్ విజయం సాధించగా.. గతంలో 49 రోజుల పాటు ప్రధానిగా పనిచేసిన లిజ్ ట్రస్ మాత్రం ఓటమి పాలయ్యారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)