నిరసనల చక్రబంధంలో 'దీదీ'..
కోల్కతా మహిళా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనానంతర నిరసనలతో బెంగాల్ అట్టుడికిపోతోంది. ముఖ్యంగా కోల్ కతా నిరసన జ్వాలతో రగిలిపోతోంది.మెడికోలు,విద్యార్థులు, స్వచ్చందసంస్థల ప్రతినిధులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు.అయితే ఇటీవలి కాలంలో వీరికి బీజేపీనేతలు, కార్యకర్తలు జతయ్యారు. వీటిని ఎలా నియంత్రించాలో అర్థం కాక మమత తలపట్టుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి అన్నిరకాలుగా పురోగతి కనిపిస్తున్నా.. ఇంకా ఎందుకు నిరసనలు కొనసాగుతున్నాయో అర్థం కాక సతమతమవుతున్నారు.
అయితే ఇందులో ప్రదాని మోడీ, అమిత్ షా మంత్రాంగం ఉందని మమత అనుమానిస్తున్నారు. మంటల్లో బెంగాల్ జ్వలించేట్లుగా మోడీ తమ పార్టీని ఉసిగొల్పుతున్నారని టీఎంసీ విద్యార్ధి విభాగం స్థాపించిన రోజును పురస్కరించుకుని మమత ఆరోపించారు.బెంగాల్లో అశాంతి ఇతర రాష్ట్రాలకు కూడా తీవ్ర పరిణామాలు కలిగిస్తుందని హెచ్చరించారు. ''బెంగాల్ తగులబడితే, అసోం, ఈశాన్యం, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగలబడతాయన్నారు. మీ కుర్చీని కూడా పడగొడతాం'' అని మమత గట్టిగానే ఫైరయ్యారు. పశ్చిమబెంగాల్ను అస్థిర పరచేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని మమత ఆరోపించారు.
''కొందరు ఇది బంగ్లాదేశ్ అని అనుకుంటున్నారు. వాళ్లు గుర్తుంచుకోవాలి. నేను బంగ్లాదేశ్ను ప్రేమిస్తున్నారు. వాళ్లు కూడా మనలాగే మట్లాడతారు, వారి సంస్కృతి కూడా మనలాగే ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ వేరే దేశం, మనది వేరే దేశం'' అని మమతా బెనర్జీ తెలిపారు. మమత వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత ఘాటుగా స్పందించారు. ‘‘అసోంను బెదిరించడానికి మీకు ఎంత ధైర్యం’’ అని ఆమెపై మండిపడ్డారు'' దీదీ.. అసోంను బెదరించడానికి మీకెంత ధైర్యం? మా మీద కళ్లు ఎర్ర చేయకండి.మీ రాజకీయ వైఫల్యాలకు ఇండియాను తగులపెట్టే ప్రయత్నం కూడా చేయొద్దు. విభజనభాషలో మీరు మాట్లాడటం సరికాదు'' అని హిమంత్ బిస్వా శర్మ ట్వీట్ చేశారు.