ఆ పనులు పూర్తి చేస్తే కేసీఆర్కు.. పేరొస్తుందని భయపడుతున్నారా? : కేటీఆర్
కేవలం 10 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా నేరెళ్లపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ పనులు పూర్తి చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందని భయపడుతున్నారా అంటూ ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నార్లాపూర్ నుంచి ఉదండపూర్ వరకు దాదాపుగా అన్ని జలాశయాల నిర్మాణం పూర్తి అయిందని, కాల్వలు తవ్వి నీరందిస్తే పాలమూరు పచ్చపడుతుందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పిలిచిన కాల్వల టెండర్లను, అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ రద్దు చేసిందని గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
మేడిగడ్డకు వెళ్లినట్లుగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శిస్తామని, పూర్తి అయిన ప్రతీ జలాశయాన్ని ప్రజలకు చూపిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చి వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 523 సర్వే నెంబర్లో 75 మంది దివ్యాంగుల ఇళ్లను అధికారులు ఎలాంటి నోలీసులు ఇవ్వకుండా కూల్చివేయడాన్ని ఖండిరచారు. పేదల ఇళ్లను కూల్చడానికే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారంటూ నిలదీశారు. ఇళ్లు కోల్పోయిన బాధితులందరికీ తక్షణమే రెండు పడక గదుల ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా ఇళ్లు కూల్చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.