నాకెలాంటి మినహాయింపులూ వద్దు.. సీఎం రేవంత్కు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతగా తనకు ఎలాంటి మినహాయింపులు వద్దని అందులో పేర్కొన్నారు. సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఎలా ఉంటుందో అలాగే వ్యవహరిస్తే చాలన్నారు. మీరు, నేను కలుగజేసుకోకుండా చట్టాన్ని తన పని తాను చేసుకుని పొనిద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన, సుందరీకరణను స్వాగతిస్తున్నా. పార్టీ శ్రేయోభిలాషులు కొందరు మొదటి దశలో మూసీ ప్రక్షాళన చేయాలన్నారు. రెండో దశలో సుందరీకరణ చేపడితే బాగుంటుందని మీకు సూచించాలని కోరారు. మూసీ సుందరీకరణపై మీ ఆసక్తి, సమర్థతను గమనించే ఇవి మీ దృష్టికి తీసుకురాలేదు. పేదలకు నష్టం లేకుండా మన ప్రభుత్వం చేపట్టే అన్ని పనులు స్వాగతిస్తున్నాం. కొంత మంది నేతలు వారి స్వప్రయోజనాల కోసమే విమర్శలు చేస్తున్నారు. మూసీ విషయంలో ప్రతిపక్షాలది మొసలి కన్నీరేనని ప్రజలందరికీ తెలుసు. మీ ఆశయాలను దెబ్బతీసే కొంతమంది ప్రయత్నాలను నేను ఖండిస్తూన్నా అని అన్నారు.