వీరమల్లుపై హైప్ పెంచాల్సిన టైమొచ్చింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఓజీకే బ్రహ్మరథం పడుతూ ఆ సినిమా హైప్ లోనే ఊగిపోతున్నారు. ఓజీ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నప్పటికీ, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియనప్పటికీ ఆ సినిమాకు నెక్ట్స్ లెవల్ లో ఓపెనింగ్స్, హంగామా ఉంటుందని వారి హంగామా తెలియచేస్తుంది.
కానీ పరిస్థితులు చూస్తుంటే ఓజీ కంటే ముందుగా హరిహర వీరమల్లునే రిలీజయ్యేట్లుంది. ఈ సినిమాకు నిర్మాత ఏఎం రత్నం టైమ్ తో పాటూ డబ్బును కూడా చాలా ఎక్కువే ఖర్చు చేశారు. సినిమా బాగా లేటవడంతో క్రిష్ నుంచి దర్శకత్వ బాధ్యతలు ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణకు వచ్చాయి. ఈ నెలాఖరు నుంచి లేదా అక్టోబర్ నుంచి పెండింగ్ షూటింగ్ ను పవన్ కు అనుకూలమైన డేట్స్ లో పూర్తి చేసేలా విజయవాడలో సెట్స్ కూడా వేస్తున్నారని సమాచారం.
కరోనా కంటే ముందైన ఈ సినిమా ఇంకా పూర్తవకపోవడంతో ఆడియన్స్ తో పాటూ ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గింది. వాస్తవానికి పవన్ చేతిలో ఉన్న మూడు సినిమాల్లో వీరమల్లుకే ఎక్కువ హైప్ ఉండాలి కానీ లేట్ అవడం వల్ల ఆ హైప్ తగ్గిపోయింది. కాబట్టి ఇప్పటినుంచి వీరమల్లు టీమ్ ప్రమోషన్స్ పై ఫోకస్ చేసి ఓ ప్లాన్ ప్రకారం సినిమాను ఫ్యాన్స్ లోకి, ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలి. ఈ సినిమాలో కీరవాణి సంగీతం, బాబీ డియోల్ స్పెషల్ రోల్, నిధి అగర్వాల్ గ్లామర్ లాంటి ఎన్నో స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి. వాటికి తోడు దిమ్మతిరిగే సెట్స్, పవన్ చేసే అద్భుతమైన విన్యాసాలు కూడా ఉండబోతున్నాయి. వీటన్నింటినీ ఫ్యాన్స్ లోకి తీసుకెళ్లి సినిమాపై హైప్ పెంచితే తప్ప వీరమల్లు వర్కవుట్ అయ్యే ఛాన్స్ లేదు. వచ్చే ఏడాది వేసవికి హరిహర వీరమల్లును రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.