మాజీ సీఎం జగన్, ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై కేసు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సహా పలువురిపై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద తనను అరెస్టు చేసి వేధించారని రఘురామ పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్తో పాటు అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్ కుమార్, మరికొందరు అధికారులపై ఫిర్యాదు చేశారు. కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై దాడి చేశారని ఆరోపించారు. 2021 మే 14న హత్యయత్నం చేశారని, రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ (ఏ1), ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్ఆర్ అంజనేయులు (ఏ2), జగన్ ( ఏ3), అప్పటి సీఐడీ ఏఎస్పీ విజయ్పాల్ (ఏ4), గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెట్ డాక్టర్ ప్రభావతి (ఏ5)పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, తప్పుడు నివేదికలు, భయభ్రాంతులకు గురిచేయడం తదితర అంశాలకు సంబంధించిన పలు సెక్షన్లు పెట్టారు. వీటిలో బెయిల్బుల్, నాన్బెయిల్ సెక్షన్లు కూడా ఉన్నాయి.