ఈ తీర్పు బీఆర్ఎస్, కేసీఆర్ విజయం : పాడి కౌశిక్ రెడ్డి
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పునిచ్చిందని, ఈ తీర్పు బీఆర్ఎస్, కేసీఆర్ విజయమని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. న్యాయ వ్యవస్థ జోక్యంతోనయినా సముచిత నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ కోరారు. హైకోర్టు ఆదేశాలను ప్రజాస్వామ్యవాదులందరూ స్వాగతిస్తున్నారన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాన్ని అనుసరిస్తోందని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఫిరాయింపుల విషయంలో ఏం చేస్తారోనని దేశమంతా రాహుల్ గాంధీ వైపునకు చూస్తోందని తెలిపారు. పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, అందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. శాసనసభ గౌరవం, ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత సభాపతిపై ఉందని వివేకానందగౌడ్ అన్నారు. నాలుగు వారాల్లోపే పదిమందిపై సభాపతి అనర్హత వేటువేయాలని కోరారు.