శ్రీసిటీలో అలరించిన పద్మావతి పరిణయం హరికథా గానం
శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కు చెందిన ప్రముఖ హరికథా విద్వాంసుడు ‘హరికథా దురంధర’ బిరుదాంకితుడు వై.వెంకటేశ్వర్లు భాగవతార్ శ్రీసిటీలో ఆలపించిన పద్మావతి పరిణయం హరికథా గానం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది.
కథనానికి పాటలను జోడించి అద్భుత హావభావాల మేళవింపుతో శ్రీనివాసుడు, పద్మావతి దేవి దివ్య వివాహాన్ని భాగవతార్ ఎంతో ఆసక్తికరంగా, అనర్గళంగా వివరించాడు. తిరుమల-తిరుపతి ప్రాముఖ్యతను, శ్రీనివాస భగవానుడి అవతారం, పద్మావతి పట్ల ఆయనకున్న ప్రేమ, వారి అపూర్వ కలయికను కళ్ళకు కట్టినట్లు తెలియచేసాడు.
అద్భుత హరికథా గానానికి మంత్రముగ్ధులైన శ్రోతలు, కథలో లీనమై, నిజంగా దైవిక వివాహాన్ని చూస్తున్నట్లుగా పరవశిస్తూ "గోవిందా, గోవిందా" అంటూ నినాదాలు చేస్తూ కీర్తనలతో జతకలిపారు. విరామం లేకుండా రెండు గంటల పాటు సాగిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
భాగవతార్కు తోడుగా నిష్ణాతులైన సంగీత విద్వాంసులు తబలాపై రెడ్డి శంకర్, కీబోర్డ్పై ఎస్.మురళి, శృతిపై జి.శ్రీనివాసులు, రిథమ్ పాడ్పై విజయ చంద్ర వారి సంగీత నైపుణ్యం ఈ కార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించింది.
వెంకటేశ్వర్లు, సహచర కళాకారుల అత్యుత్తమ ప్రదర్శనను కొనియాడిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, వారిని జ్ఞాపికలతో సత్కరించారు.
శ్రీసిటీ పీఆర్ఓ పల్లేటి బాలాజీ కార్యక్రమ సమన్వయకులుగా వ్యవహరించారు. శ్రీసిటీ, పరిశ్రమల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పరిసర గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.