జగన్ను పవన్ సైలెంట్గా తొక్కేస్తున్నారా..!?
“గుర్తు పెట్టుకో జగన్.. నిన్నూ నీ పార్టీనీ అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు” ఇదీ ఎన్నికల ముందు ప్రచార సభల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన కామెంట్స్. సహజంగా ఎన్నికల ప్రచార సమయాల్లో రాజకీయ నేతల నుంచి ఇలాంటి మాటాలు రావడం మామూలే. ఎన్నికల్లో గెలవడానికి, కేడర్ ను ఉత్సాహపరచడానికి నేతలు చాలా మంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇక పవన్ కల్యాణ్ ఇలాంటి మాటలు మాట్లాడితే ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆ మాటలను నిజం చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YCP) ఓడిపోయి కూటమి (NDA) అధికారంలోకి వచ్చింది. కూటమిలో (NDA Alliance) పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా (Deputy CM) ఉన్నారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంపై పవన్ పలు సందర్భాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది వైసీపీ. అతని వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని జగన్ (YS Jagan) సహా నేతలు విమర్శిస్తూ వచ్చారు. ప్యాకేజ్ స్టార్ (Package Star) అని, దత్తపుత్రుడు అని ఎద్దేవా చేస్తూ వచ్చారు. వీటన్నిటినీ పవన్ భరిస్తూ వచ్చారు. వైసీపీ ఓటమే లక్ష్యంగా గట్టిగా పని చేశారు. టీడీపీ, బీజేపీ కంటే ఎక్కువ కసి పవన్ లోనే కనిపించింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ పూర్తిగా నీరుగారిపోయింది. నేతలు చల్లబడిపోయారు. దేశంలో ఎవరూ చేయని విధంగా తాము అభివృద్ధి చేశామని వైసీపీ చెప్తూ వచ్చింది. అయినా ఆ పార్టీకి దక్కింది కేవలం 11 సీట్లు మాత్రమే. దీంతో నేతలు తలెత్తుకోలేకపోతున్నారు. చాలా మంది ఆ పార్టీని వీడుతున్నారు. మరికొంతమంది సైలెంట్ అయిపోయారు. ఇంకొంతమంది రాజకీయాలకే స్వస్తి చెప్పేలా కనిపిస్తున్నారు. ఒక్క ఓటమి పార్టీని ఇంత దారుణ పరిస్థితికి తీసుకొస్తుందా అని చెప్పడానికి వైసీపీయే పెద్ద ఉదాహరణ.
వైసీపీలో ఇప్పుడు ఎక్కువమంది నేతల చూపు పవన్ కల్యాణ్ వైపే ఉంది. ఇటీవల రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivas Reddy), రాజీనామా చేయబోతున్న సామినేని ఉదయభాను (Samineni Udaya Bhanu) జనసేనలో చేరడం ఖాయమైంది. త్వరలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య (Kilaru Rosaiah), పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు (Pendem Dorababu) పవన్ గ్రీన్ సిగ్నల్ కోసం వేచిచూస్తున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి (Kethireddy Venkatrami Reddy) కూడా పవన్ తో భేటీ అవుతారని సమాచారం. ఇలా ఎంతోమంది నేతలు వైసీపీ నుంచి బయటపడి పవన్ చెంత చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. జనసేన (Janasena) పార్టీలో చేరేందుకు వస్తున్న రెస్పాన్స్ చూసి ‘పవన్ నిజంగానే జగన్ ను అథఃపాతాళానికి తొక్కేస్తున్నాడుగా..’ అని కామెంట్స్ చేసుకుంటున్నారు జనసైనికులు.