Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ఎన్నికల ఆరంగేట్రం..! వయనాడ్ గెలిపిస్తుందా..?
దేశ రాజకీయాల్లో గాంధీ కుటుంబానికి (Gandhi Family) దశాబ్దాల చరిత్ర. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ (Congress Party) అంటే గాంధీ కుటుంబమే గుర్తొస్తుంది. రాజకీయాలు ఆ కుటుంబానికి వారసత్వంగా వస్తున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. ఇప్పుడు ప్రియాంక గాందీ.. ఇలా ఒకరి తర్వాత ఒకరు రాజకీయాల్లోనే ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా యాక్టివ్ గా ఉంటున్నారు. కానీ ఇంతవరకూ ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు తొలిసారి ఎలక్షన్ వార్ లో అడుగు పెడుతున్నారు.
పదేళ్లుగా ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా తదితర రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. అయితే ఆమె మాత్రం ఎన్నికల్లో నేరుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపించలేదు. అయితే ఇప్పడు ఎన్నికల బరిలో నిలబడాల్సి వచ్చింది. తాజా ఎన్నికల్లో సోదరుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాయ్ బరేలీ (Raebareli), వయనాడ్ (Wayanad) నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో ఒక సీటును వదులుకోవాల్సి వచ్చింది. వయనాడ్ ను వదులుకున్నారు. అంతకుముందు 2019లో అమేథీ, వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్.. కంచుకోట అమేథీలో (Amethi) ఓడిపోయారు. వయనాడ్ మాత్రం అత్యధిక మెజారిటీతో గెలిపించింది.
వరుసగా రెండు సార్లు తనకు పట్టం కట్టిన వయనాడ్ సీటును మరొకరికి ఇవ్వడం ఇష్టం లేక సోదరి ప్రియాంక గాంధీని బరిలోకి దింపుతున్నారు రాహుల్ గాంధీ. ఇదే ప్రియాంకకు తొలి ఎన్నిక. ఇక్కడ కచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. వయనాడ్ వరదల (Wayanad Floods) సమయంలో కూడా రాహుల్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ చురుగ్గా పాల్గొన్నాయి. బాధితులను ఆదుకున్నాయి. పైగా గతంతో పోల్చితే కాంగ్రెస్ పార్టీ బలపడింది కాబట్టి కచ్చితంగా ప్రియాంక విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉంది కాంగ్రెస్ పార్టీ.
అయితే వయనాడ్ సీటును రాహుల్ గాంధీ వదులుకోవడాన్ని విపక్షాలు అస్త్రంగా మార్చుకుంటున్నాయి. రాయ్ బరేలీ, అమేథీ లాంటివే గాంధీ కుటుంబానికి ఫస్ట్ ప్రయారిటీ అని.. వయనాడ్ ఎప్పటికీ సెకండ్ ప్రయారిటీయే అని ఎద్దేవా చేస్తున్నాయి. ఇది ప్రియాంకకు కాస్త మైనస్ గా మారింది. అయితే వయనాడ్ తమ గుండెల్లో ఉంటుందని చెప్పేందుకు.. నిరూపించుకునేందుకు గాంధీ ప్యామిలీ తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రియాంక గాంధీ పైన బీజేపీ (BJP) నవ్య హరిదాస్ (Navya Haridas) ను బరిలోకి దింపుతోంది. ఇక్కడ నవ్య హరిదాస్ కు మంచి పేరుంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ (LDF) సత్యన్ మొఖేరీని (Sathyan Mokheri) పోటీ చేయిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా రెండో స్థానంలో ఎల్డీఎఫ్ నిలిచింది. బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. మరి ఈ ఉపఎన్నికల ఫలితం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.