‘ఏఐ’తో ఉద్యోగాలు పోవు : రాహుల్గాంధీ
కృత్రిమ మేధ(ఏఐ)తో నిరుద్యోగం ఏర్పడుతుందన్న వాదనను ప్రతిపక్షనేత రాహుల్గాంధీ కొట్టి పారేశారు. ఏఐతో పాతవి పోయి కొత్త తరహా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని చెప్పారు. అంతిమంగా ఏఐతో మంచే జరుగుతుందన్నారు. టెక్సాస్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయమై మాట్లాడారు. ‘క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు వచ్చినపుడు ఇలానే ఉద్యోగాలు పోతాయన్నారు. ఏమైంది. కొత్త ఉద్యోగాలు వచ్చాయి తప్ప ఏం నష్టం జరగలేదు. అయితే ఏఐతో భారత్లో ప్రధానంగా ఐటీ రంగం సమస్య ఎదుర్కోబోతోంది. అదే సమయంలో స్కూటర్లు తయారు చేసే బజాజ్ కంపెనీకి ఏఐతో సమస్యేమీ లేదు. ఏఐ ఒక్కో రంగాన్ని ఒక్కోలా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఉద్యోగాలు పోయేలా చేస్తుంది. కొన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. మనం సరిగ్గా వాడుకుంటే ఏఐ కొత్త అవకాశాలను కల్పిస్తుంది’అని రాహుల్గాంధీ అభిప్రాయపడ్డారు.
టెక్సాస్ యూనివర్సిటీలో విద్యార్థులనుద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ, భారత్, అమెరికా సహా కొన్ని పశ్చిమ దేశాలను నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తోందని, అదే సమయంలో చైనా మాత్రం ఆ ఇబ్బందిని ఎదుర్కోవట్లేదని తెలిపారు. ఉత్పత్తి రంగంలో డ్రాగన్ ఆధిపత్యమే ఇందుకు కారణమన్నారు. తయారీ రంగంపై భారత్ మరింత దృష్టిపెట్టాలన్నారు.