ఎఐ హబ్గా ప్యూచర్ సిటీ : రేవంత్ రెడ్డి
ఘనంగా ముగిసిన ఎఐ గ్లోబల్ సమ్మిట్
హైదరాబాద్లో సెప్టెంబర్ 5,6 తేదీల్లో హెచ్ ఐ సిసిలో నిర్వహించిన ఎఐ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైంది. ఈ సమ్మిట్కు దేశ విదేశాల నుంచి ఎఐ నిపుణులు హాజరయ్యారు. ఈ సమ్మిట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. సాంకేతిక రంగంలో అత్యుత్తమ ఆవిష్కరణగా చెప్తున్న ఆర్టిఫ్ిౖయల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు ` ఏఐ) టెక్నాలజీకి హైదరాబాద్ను కేంద్రంగా తీర్చిదిద్దుతా మని ఈ సందర్భంగా రేవంత్రెడ్డి ప్రకటించారు. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్తో సరిపోలే నగరమేదీ దేశంలో లేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఏఐని ప్రోత్సహించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తూనే భవిష్యత్తును సృష్టిస్తామన్నారు. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని భారత్ సరిగా అనుసరించలేక పోయిందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.
ఎన్నికల ముందు డిక్లరేషన్లో చెప్పినట్టే ఎఐకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సదస్సును ఏర్పాటు చేశామని అంటూ, ఎఐ రోడ్ మ్యాప్ ను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అందరికి అవకాశం ఇస్తున్నామని తెలిపారు. సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదన్నారు. మొదటి రైలు, ఇంజిన్ ఆవిష్కరణ తరువాత ప్రపంచం పూర్తిగా మారిందన్నారు. విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపమే మారిపోయిందన్నారు. ఇదే క్రమంలో కరెంటు, బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్ ఇవన్నీ ప్రపంచ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. టెలివిజన్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ చూడటం మన తరం చేసుకున్న అదృష్టం అన్నారు. ఇవాళ ప్రపంచ సాంకేతికరంగంలో వచ్చిన అత్యుత్తమ ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు.
కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా కొంత భయం నెలకొంటుందని తెలిపారు. అది మన జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుంది. అదే సమయంలో ఉద్యోగాలు పోతాయా అన్న భయం ఉండటం సహజం అన్నారు రేవంత్. దేశ చరిత్రను పరిశీలిస్తే గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని సరిగ్గా అనుసరించలేకపోయామని తెలిపారు. భారతదేశ భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తే.. హైదరాబాద్ సిటీలా మరో సిటీ పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణంగా సిద్ధంగా లేదన్నారు. ఇందుకు సంబంధించిన సవాళ్ళను స్వీకరించడమే కాదు భవిష్యత్తును సృష్టిస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చాలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ రంగంలో మన భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటున్నామన్నారు. తెలంగాణ ఎఐ మిషన్, లేదా నాస్కామ్ భాగస్వామ్యంతో టి ఎఐఎం తెలంగాణలో ఎఐ ఫ్రేమ్వర్క్ను అమలు చేయడంలో తమకు సహకరిస్తాయన్నారు ముఖ్యమంత్రి. ఇండస్ట్రీ నిపుణులతో కలిసి ఆవిష్కరణలను ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందన్నారు.
హైదరాబాద్ ను ఎఐ హబ్ గా తీర్చిదిద్దబోతున్నామనేందుకు ఈ సదస్సు నిదర్శనం అన్నారు. సిటీ ఆఫ్ ది ఫ్యూచర్కి మీ అందరికి స్వాగతం అన్నారు. మనమందరం కలిసి ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప ఎఐ హబ్ గా తీర్చిదిద్ధే సంకల్పంతో మీరంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో నిర్మించనున్న ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. ఏఐ లాంటి కొత్త టెక్నాలజీ వచ్చిన సమయంలో.. ఓ వైపు జీవితం మెరుగు పడుతుందనే ఆశ ఉండగా, మరోవైపు ఉద్యోగ భద్రత ఉండదనే భయం కూడా సహజంగానే ఉత్పన్నమవుతోందన్నారు. కానీ ఏఐ టెక్నాలజీని ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు.
ఏఐలో ఆవిష్కరణలు కీలకం: బీవీఆర్ మోహన్రెడ్డి
ఏఐ రంగంలో కొత్తగా ఆవిష్కరణలు, కొత్త యాప్లు అత్యంత కీలకమని నాస్కామ్ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి అన్నారు. పాఠశాల స్థాయి నుంచే ఏఐపై పాఠాలు, పరిశోధనలకు వాణిజ్య రూపం ఇవ్వడం, ఏఐలో కొత్త మార్కెట్ను సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ఐటీ రంగ ప్రముఖులు రాబిన్, వరప్రసాద్రెడ్డి, అశోక్ స్వామినాథన్తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ రమాదేవి లంకా, ఎమ్మెల్యే మదన్మోహన్రావు తదితరులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రపంచం నలుమూలల నుంచి కృత్రిమ మేథ రంగంలో పేరొందిన ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరైన సదస్సులో సమాజంపై ఏఐ ప్రభావం నియంత్రణ, సవాళ్లపై సదస్సులో చర్చించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్దిదశలో ఉన్న వినూత్న ప్రాజెక్ట్లను ఇందులో ప్రదర్శించారు.
రెండో రోజు కార్యక్రమాన్ని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రారంభించారు. తెలంగాణ యుత కోసం నైపుణాభివృద్ధి ఫ్రేమ్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా సదస్సులో చర్చలు జరిగాయి. రాష్ట్రాన్ని ఏఐ హబ్గా మార్చాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న సర్కార్ ఏఐ, ఏఐ అనుమంధ రంగాలకు చెందిన దాదాపు 20 కంపెనీలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చకుంది. ప్రతిఒక్కరికీ కృత్రిమ వేధస్సును అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి ఈ రంగంలో పేరొందిన ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు దాదాపు 2వేల మంది హాజరయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సమాజానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో, ఎలా సాధికారత కల్పిస్తుందో అన్వేషించటమే లక్ష్యంగా మేథోమధనం జరిగింది. సమాజంపై ఏఐ ప్రభావం నియంత్రణ, సవాళ్లపై సదససులో చర్చించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ది దశలో ఉన్న వినూత్న ప్రాజెక్ట్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, టాస్క్, హైసీయాల మద్య అవగాహన ఒప్పందం కుదిరింది.రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పది వేల మందికి ఏఐతో పాటు ఇతర సాంకేతక రంగాల్లో శిక్షణ అందించనున్నారు. యువతను అత్యాధునిక నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం, టెక్ ఎకసిస్టమ్లో ఆవిష్కరణల వృద్ధికి ఈ ఒప్పందరం దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
ఏఐలో గ్లోబల్ లీడర్గా తెలంగాణ సత్తా చాటనుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. రెండో రోజు సెషన్ ప్రారంభిన అనంతరం మాట్లాడుతూ డేటా గోప్యత, నైతిక విలువల్లో పూర్తిగా పారదర్శకంగా ఉంటామని చెప్పారు. సాంకేతికత పక్కదారి పట్టకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా ఏఐ-ఆధారిత పాలన, పాఠశాలల్లో ఇంటర్నెట్ విద్యాబోధన, యంగ్ ఇండియా స్కిల్స్ విశ్వవిద్యాలయం ఏఐ పట్ల రాష్ట్ర నిబద్దతతను చాటుతుందని పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలను అంది పుచ్చుకోవడం ద్వారా తెలంగాణను టిలియన్ డర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఏఐ సిటీలోకి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ తొలి అడుగు వేసింది. ఏకంగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాల కార్యాలయం నిర్మిస్తామని ప్రపంచ వాణిజ్య కేంద్రం అసోసియేషన్ డబ్ల్యూటీసీఏ ముందుకొచ్చింది. ఈ మేరకు హెచ్ఐసీసీలో నిర్వహించిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో రాష్ట్రప్రభుత్వంతో డబ్ల్యూటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పంద పత్రాలను రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జయేశ్రంజన్, డబ్ల్యూటీసీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాబిన్ వాన్ పుయెన్బ్రోక్, డబ్ల్యూటీసీ ఛైర్మన్ వరప్రసాద్రెడ్డిలు మార్చుకున్నారు. కార్యక్రమంలో డబ్ల్యూటీసీ వైస్ ప్రెసిడెంట్ భార్గవ శ్రీవారి, డబ్ల్యూటీసీ డైరెక్టర్ వంశీకృష్ణ, ఐటీ మంత్రి సలహాదారు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీలో డబ్ల్యూటీసీఏ ఆధ్వర్యంలో మిలియన్ స్వేర్ ఫీట్లతో బహుళ అంతస్థుల భవనాలు నిర్మించేలా అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ ఏఐ మార్కెట్ను తెలంగాణ వైపు మళ్లించడంలో తొలి అడుగు పడిరదని ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. ఏఐ సిటీలో డబ్ల్యూటీసీ కార్యాలయం ఏర్పాటు చేయడం శుభపరిణామని అన్నారు. ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించేందకు వందల కంపెనీలు ముందుకొ స్తాయని వివరించారు. తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగులని నియమించుకుంటాయని తెలిపారు.
200 ఎకరాల్లో ఏఐ సిటీ: శ్రీధర్బాబు
తెలంగాణ రాష్ట్రం ఏటా 11.3 శాతం వృద్ధిరేటుతో ముందుకు సాగుతూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని 176 బిలియన్ డాలర్లకు చేర్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. త్వరలో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఏఐ పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని తీర్చిదిద్దుతామని తెలిపారు. . డీప్ఫేక్ లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఏఐని సరైన దారిలో ఉపయోగించుకుంటామని చెప్పారు. ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని పేర్కొన్నారు. ఎథికల్ ఏఐ విషయంలో జపాన్ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఏఐ సిటీ నూతన ఆవిష్కరణలకు పుట్టినిల్లుగా నిలుస్తుందని, స్కూల్ ఆఫ్ ఏఐ ఎక్సలెన్స్ను కూడా ప్రారంభిస్తామని అన్నారు. ఏఐ ఆధారిత కంపెనీల కోసం తాత్కాలికంగా శంషాబాద్లోని ప్రపంచ వాణిజ్య కేంద్రంలో రెండు లక్షల చదరపు అడుగుల్లో అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి చెప్పారు.
‘ఏఐ ఆధారిత తెలంగాణ’లక్ష్యాల సాధన దిశగా ప్రైవేటురంగ సంస్థలు, విద్యా సంస్థలు, దిగ్గజ టెక్ కంపెనీలు, స్టార్టప్లు, లాభాపేక్ష లేని సంస్థలతో 26 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు శ్రీధర్బాబు వెల్లడిరచారు. ఈ ఒప్పందాల్లో కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్లెన్స్ కేంద్రం, స్కిల్లింగ్, ఇంపాక్ట్ అసెస్మెంట్, స్టార్టప్ ఇన్నొవేషన్, జనరేటివ్ ఏఐ, పరిశోధన సహకారం, డేటా అన్నోటేషన్ రంగాలకు సంబంధించినివి ప్రధానంగా ఉన్నాయని తెలిపారు. ఏఐ ద్వారా తెలంగాణను ప్రపంచ మేధోశక్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రణాళికలు పటిష్టంగా రూపొందిస్తున్నామని చెప్పారు.