సాయి ధరమ్ తేజ్కు ప్రశంసల వెల్లువలు
సమాజంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సెలబ్రిటీలు రియాక్ట్ అవుతుండటం మనం చూస్తూనే ఉంటాం. రెండ్రోజుల కిందట సోషల్ మీడియాని కుదిపేసిన యూట్యూబర్ల ఉదంతం గురించి నెట్టింట ఎంత రచ్చ జరుగుతుందో చూస్తున్నాం. తండ్రీ కూతుళ్ల మధ్య జరిగిన చిన్న వీడియో క్లిప్ ను తీసుకుని దాన్ని తప్పుడు అర్థాలొచ్చేలా చేసి ఫాలోయర్స్ కు డార్క్ కామెడీ పేరుతో నవ్వించాలని చూశారు. కానీ ఆ ప్రయత్నం బెడిసి కొట్టడమే కాకుండా వారి కుటుంబాలకు చెడు పేరును తీసుకొచ్చింది. ఈ వివాదం ముందుగా ట్విట్టర్ కు మాత్రమే పరిమితమైంది. కానీ ఎప్పుడైతే ఈ విషయంపై టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడో అప్పటినుంచి ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటూ కీలక పోలీసాఫీసర్లను కూడా ట్యాగ్ చేయడంతో అందరి దృష్టి దీనిపై మళ్లింది.
తర్వాత తేజూకి మద్దతుగా విశ్వక్సేన్, సందీప్ కిషన్ లాంటి యంగ్ హీరోలు కూడా మద్దుతుగా నిలిచి ఈ ఇలాంటివి జరగకుండా కట్టడి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించడంతో ఈ ఇష్యూని డిపార్ట్మెంట్ కూడా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. ఏదేమైనా ఖండించాల్సిన సంఘటన పట్ల తేజూ ఇలా వేగంగా స్పందించిన వైనం ఫ్యాన్స్ తో పాటూ మిగిలిన వారి మనసులు కూడా గెలుచుకుంటుంది. దీంతో తేజూని అందరూ ప్రశంసిస్తున్నారు.