సజ్జల సహకరించాలి.. హైకోర్టు ఆదేశం
మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ నేత, గత ప్రభుత్వంలో ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తునకు సహకరించాలని సజ్జలను హైకోర్టు ఆదేశించింది. ప్రధాన బెయిల్పై విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది.
టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఈ కేసులో సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నన్ను 120వ నిందితుడిగా చేర్చారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారు. అదే క్రమంలో నాపైనా కేసు పెట్టారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు నిబంధల ప్రకారం నేను రక్షణ పొందకుండా అడ్డుకునేందుకే, హత్యాయత్నం సెక్షన్ను చేర్చారు. నేను అమాయకుడిని. కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటాను. ముందస్తు బెయిల్ మంజూరు చేయండి అని పిటిషన్లో సజ్జల పేర్కొన్నారు.