వైసీపీ నుంచి ఆగని వలసల పర్వం..షాక్ లో జగన్..
2024 ఎన్నికల తర్వాత వైసీపీ లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస వలసలతో వైసీపీ కుదేలు అవుతోంది. తాజగా వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ ను వీడి వెళ్లడం పార్టీకి పెద్ద షాక్ గా ఉంది. ఇంకా ఈ షాక్ నుంచి కోలుకోక ముందే మరొక కీలక నేత పార్టీని విడిచి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే అయిన సామినేని ఉదయభాను పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపించారు. కేవలం తనకు గుర్తింపు లేదు అన్న అసంతృప్తి తోటే పార్టీని వీడి వెళుతున్నట్లుగా ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ పార్టీలో తనకు ఇవ్వవలసిన గుర్తింపు ఇవ్వడం లేదు అన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
ఈనెల 22న ఉదయభాను జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని.. కేవలం తన ఆత్మ అభిమానాన్ని కాపాడుకోవడం కోసమే వైసీపీ ను విడిచి వెళ్తున్నానని వెల్లడించారు. ఇప్పటికే ఉదయభాను గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిశారు. పార్టీలో చేరడానికి తన ఆసక్తిని తెలిపి తనతో పాటు మరికొందరు ఎంపీపీలు,జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీల సర్పంచులు పార్టీలో చేరుతారని వెల్లడించారు.
ఉదయభాను వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. 1999లో జగ్గయ్యపేటలో ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయభాను 2004లో కాంగ్రెస్ తరపున మరొక సారి విజయం సాధించారు. అనంతరం 2009, 2014లో ఓటమిపాలైన ఉదయభాను 2019లో తిరిగి జగ్గయ్యపేటలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా మొత్తం మీద ఆరుసార్లు పోటీ చేస్తే మూడుసార్లు గెలుపు దక్కించుకొని మూడుసార్లు ఓటమి మూట కట్టుకున్నాడు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం విప్ గా వ్యవహరించిన ఉదయభాను పేరు మంత్రి పదవి కోసం వినిపించిన ప్రయోజనం లేకపోయింది. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడానికి సముఖంగా లేను అని ఉదయభాను చెప్పడమే పార్టీలో అతనిపై వ్యతిరేకతకు కారణమని అందరూ భావిస్తున్నారు. అందుకే జగన్ అతనికి మంత్రి పదవి ఇవ్వలేదు అన్న టాక్ కూడా నడుస్తోంది. ఇక జనసేనలో ఉదయభానుకి కీలకమైన పదవి దక్కే అవకాశం ఉంది అని అందరూ భావిస్తున్నారు. అయితే ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు పార్టీని విడిపోవడంతో వైసీపీ వెలవెలబోతోంది.