బాబుకి సెట్ కాని సెప్టెంబర్.. దీని ఎఫెక్ట్ ఇంకా ఉంటుందా..
సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని (TDP )స్థాపించిన అన్న ఎన్టీఆర్ (NTR)కు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. రాజకీయపరంగా కూడా ఆయనకు అదే సెంటిమెంట్ ఒక నెల విషయంలో ఎక్కువగా ఉండేది. ఎన్టీఆర్ గారికి ఆగస్టు నెల అంటేనే సంక్షోభాలకు కేరాఫ్ అడ్రస్ గా మారేది. ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు .. రెండుసార్లు ఆగస్టు నెలలో ఆయనకు వెన్నుపోట్లు తప్పలేదు. ఇప్పుడు చంద్రబాబుకి (Chandra Babu) అదే యాంటీ సెంటిమెంట్ సెప్టెంబర్ నెల రూపంలో వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది.
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను అవపోసన పట్టిన చంద్రబాబు (Chandra Babu) గత ఎడాది ఇదే సెప్టెంబర్ నెలలో జైలుకు వెళ్లారు. చంద్రబాబు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇదే తొలిసారి జైలు జీవితం కావడం గమనార్హం. జైలుకు వెళ్తే వెళ్లారు గాని ఆ సింపతీతో ఎలక్షన్స్ లో బాగానే వసూలు చేసుకున్నారు. ఇక ఆ విషయం పక్కన పెడితే గెలిచిన తర్వాత వచ్చిన ఈ సెప్టెంబర్ నెల కూడా సంక్షోభాలను వెంట తీసుకువచ్చింది. విజయవాడ భారీ వరదలతో (Vijayawada floods) రాష్ట్ర మతలాకుతలం అయింది. రోజుల తరబడి బెజవాడ నీటిలో మునిగిపోగా.. తిరిగి ప్రజల జీవితాన్ని ఒక కొలిక్కి తీసుకురావడానికి చంద్రబాబుకి చాలా కష్టమైంది. ఇలా సెప్టెంబర్ నెలలో సగం కు పైగా రోజులు వరద మీద యుద్ధంతో సరిపోయాయి. వరద బీభత్సం సద్దుమణిగింది.. సంక్షోభాలను సంక్షేమంగా మార్చాము అంటూ 100 రోజుల పండుగ కూడా చేసుకున్నారు.
అంతా సజావుగా సాగుతుంది అనుకునే సమయంలో సెప్టెంబర్ 18న ఎన్డీఏ (NDA)సమావేశంలో చంద్రబాబు శ్రీవారి లడ్డు (Tirumala Laddu) గురించి మాట్లాడారు. ఇక అది రాష్ట్రంలో ఏ రేంజ్ లో చిచ్చు పెట్టిందో అందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాలను దాటి ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డు (Tirumala Laddu) వైరల్ అయింది. అయితే సెప్టెంబర్ నెల చివరికి ఈ విషయంలో సుప్రీంకోర్టు దేవుడిని రాజకీయం చేయొద్దు అంటూ..మెత్తగా చంద్రబాబుకి నాలుగు మొట్టికాయలు వేసింది. 2024 ఎన్నికల గెలిచిన తరువాత బాబు ఇమేజ్ ఒక్కసారి విపరీతంగా పెరిగింది.. అయితే సుప్రీం కోర్ట్ వ్యాఖ్యలతో ఆ ఇమేజ్ కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. దీంతో బాబుకు సెప్టెంబర్ సెట్ కాలేదు అన్న వాదన బలంగా వినిపిస్తోంది.