ASBL Koncept Ambience
facebook whatsapp X

చైనాలో బెబింకా... మయన్మార్, వియత్నాం పై యాగీ పంజా...

చైనాలో బెబింకా... మయన్మార్, వియత్నాం పై యాగీ పంజా...

యాగి తుపాను తీవ్రత నుంచి కోలుకుంటున్న చైనాను మరో భారీ టైఫూన్ బెబింకా వణికిస్తోంది. గడచిన 70 ఏళ్ల వ్యవధిలో ఈ స్థాయి తుపానును చూడని చైనా ఆర్థిక నగరం షాంఘై.. చిగురుటాకులా వణుకుతోంది. 150 కీలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ నగరంలో బీభత్సం సృష్టించింది. బెబింకా ధాటికి షాంఘై నుంచి విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపేయగా.. వందలాది విమానాలు విమానాశ్రయాల్లోనే నిలిచి పోయాయి. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి షాంఘైలోని రెండు విమానాశ్రయాలను మూసి వేశారు. గేట్‌ వే ఆఫ్‌ ది యాంగ్జ్‌టీ రివర్‌గా పిలిచే చోంగ్‌మింగ్ ఐలాండ్ నుంచి ఫెర్రీల రాకపోకలు నిలిపేశారు. ట్రైన్ సర్వీసులను కూడా ఈ టైఫూన్ తీవ్రంగా దెబ్బ తీసింది. సినిమా హాళ్లు ఇతర ఫన్ ప్రదేశాలను, జంతు ప్రదర్శన శాలలను అన్నింటినీ తాత్కాలికంగా మూసివేస్తూ షాంఘై అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. సాదారణంగా షాంఘై సిటీని తుపానులు అతి తక్కువగానే తాకుతుంటాయి. 1945 లో బీభత్సం సృష్టించిన గ్లోరియా తుపాను తర్వాత ఆ స్థాయిలో షాంఘైపై విరుచుకు పడిన తుపాను బెబింకానేనని చైనా వాతవరణ శాఖ తెలిపింది. షాంఘై పరిధిలోని పుడోంగ్ జిల్లా పరిధిలో బెబింకా తీరం దాటగా ఆ సమయంలో సెకనుకు 47 మీటర్ల వేగంతో గాలులు వీచాయని అధికారులు తెలిపారు.

షాంఘై, జెజియాంగ్‌లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన యంత్రంగా సహాయ చర్యలు ముమ్మరం చేసింది. బెబింకా బీభత్సానికి వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండున్నర కోట్ల జనాభా ఉండే షాంఘై నగరానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నట్లు అదికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ప్రజలందరు ఇళ్లలోనే ఉండాలని సూచించిన అధికారులు చోంగ్‌మింగ్ ప్రాంతం నుంచి 9 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కొద్ది రోజుల క్రితం హెనాన్ ప్రావిన్స్‌లో యాగీ తుపాను బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలతో బెంబేలెత్తించింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడగా.. మొబైల్‌ ఫోన్‌లకు ఛార్జింగ్‌ పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఫలితంగా ప్రజలు డిజిటల్ చెల్లింపులు కూడా చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంతలోనే ఇప్పుడు బెబింకా తుపాను బీభత్సం సృష్టించింది.

వియత్నాం, మయన్మార్ లో యాగీ బీభత్సం...

వియత్నాం, మయన్మార్ దేశాల్లో యాగి తుపాను భారీ విధ్వంసం సృష్టించింది. వియత్నాంలో తుపాను కారణంగా ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఈ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరదలు ముంచెత్తాయి. ఉత్తరాది ప్రావిన్సులలోని కొన్ని ప్రాంతాల్లో వేల మంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మరికొంత మంది తమ పరిస్థితి గురించి సోషల్ మీడియాలో చెబుతూ సాయం కోసం అర్థిస్తున్నారు.గత 30 ఏళ్లలో వియత్నాంలో వచ్చిన అత్యంత విధ్వంసకర తుపాను ఇదేనని అధికారులు చెబుతున్నారు. ఈ తుపాను ఉత్తర వియత్నాంపై తీవ్ర ప్రభావం చూపింది.

మరోవైపు.. మయన్మార్ లోనూ వర్షాలుబీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నేపిడావ్ ప్రాంతం.. తీవ్రంగా దెబ్బతింది. 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు. లక్షలాది ఎకరాల్లో పంట తీవ్రంగా దెబ్బతింది. ఈమధ్య కాలంలో మయన్మార్ చూసిన అత్యంత ప్రమాదకరమైన తుపాను ఇదేనని అంతర్జాతీయ నిపుణులుచెబుతున్నారు. మరోవైపు. తమ దేశాన్ని ఆదుకోవాలని అక్కడి జుంటా సర్కార్.. అంతర్జాతీయ సమాజాన్ని కోరినట్లు సమాచారం. ఆపరేషన్ సద్భావ్ పేరిట భారత్‌కు చెందిన యుద్ధనౌక INS సత్పుర.. ఈ దేశాలకు విపత్తు సహాయ సామగ్రిని తీసుకొని బయలు దేరినట్లు ఈస్ట్రన్ నావవ్‌ కమాండర్ తెలిపారు. వియత్నాంకు లక్ష డాలర్ల విలువైన సామగ్రిని, లావోస్‌కు కూడా అంతే మొత్తంలో పంపినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :