YCP : కల్తీ నెయ్యిపై సుప్రీం హాట్ కామెంట్స్.. వైసీపీకి బిగ్ రిలీఫ్..!?
తిరుమల లడ్డూల (Tirumala Laddu) తయారీకి గత వైసీపీ ప్రభుత్వం (YSRCP) కల్తీ నెయ్యి (Adulterated ghee) వినియోగించిందంటూ సీఎం చంద్రబాబు (CM Chandrababu) చేసిన కామెంట్స్ వారం రోజులుగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. గత ప్రభుత్వం తిరుమల పవిత్రతను (Tirumala sanctity) మంటగలిపిందని.. తాము అధికారంలోకి వచ్చాక అన్నీ సెట్ రైట్ చేస్తున్నామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చెప్తోంది. కోట్లాది మంది హిందువుల (Hindus) మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈ విషయంలో వైసీపీ (YCP) డిఫెన్స్ లో పడిపోయింది. తాము తప్పు చేయలేదని చెప్పుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఈ సమయంలో సుప్రీంకోర్టు (Supreme Court) చేసిన కామెంట్స్ ఆ పార్టీకి పెద్ద ఊరట కలిగించాయి.
తిరుమల లడ్డూల్లో జంతుకొవ్వు (Animal Fat) కలిసిన నెయ్యి వాడారంటూ సీఎం చంద్రబాబు గత నెలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి చినికిచినికి గాలివానగా మారాయి. దీనిపై విచారణ జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు మొదలయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్ (SIT) ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ విచారణతో న్యాయం జరగదని.. సుప్రీంకోర్టు జడ్జితో లేదంటే సీబీఐతో విచారణ జరిపించాలంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటినీ కలిపి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
తిరుమల లడ్డూకు సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా అని ప్రశ్నించింది. ఎన్డీడీబీ (NDDB) కాకుండా ఇతర ల్యాబుల్లో సెకండ్ ఒపీనియన్ ఏమైనా తీసుకున్నారా అని నిలదీసింది. అసలు విచారణ జరగకుండానే ఇలాంటి అంశాలపై బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎలా మాట్లాడతారని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి కామెంట్ చేసింది ధర్మాసనం. జులైలోనే ల్యాబ్ రిపోర్టులు వస్తే సెప్టెంబర్ వరకూ ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించింది.. అంతేకాక.. దర్యాప్తుకు సిట్ సరిపోతుందా లేకుంటే స్వతంత్ర సంస్థతో చేయించాలా అని సొలిసిటర్ జనరల్ (Solicitor General) ను అడిగింది.
సుప్రీంకోర్టు ప్రశ్నలు వైసీపీకి (YCP) పెద్ద ఊరట కల్పించాయని చెప్పొచ్చు. ఈ ప్రశ్నలన్నింటినీ వైసీపీ కొంతకాలంగా అడుగుతూనే ఉంది. తిరుమల లడ్డూను కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తోందని వాదిస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించడంలో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సుప్రీంకోర్టు విచారణ అనంతరం వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో సత్యమేవజయతే (Sathyamevajayathe) పేరుతో పెద్దఎత్తున పోస్టులు పెట్టాయి. కల్తీ నెయ్యి వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని.. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నాయి.