బుల్డోజర్ న్యాయం హీరోయిజం కాదు.. సుప్రీంకోర్టు ఆగ్రహం..
కొంపలేం మునిగిపోవు… విచారణ దశలో ఉన్న వాటిపై బుల్డోజర్ పంపటం ఆపండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో విచారణ దశలో ఉన్న నేరగాళ్ల ఇండ్లు, కార్యాలయాలు, ఆస్తులపైకి బుల్డోజర్లు పంపటం, కూల్చేయటంపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. అనధికారికంగా చేసే ఇటువంటి చర్యలను అక్టోబర్ 1వరకు ఆపాలని స్పష్టం చేసింది. విచారణ అయ్యే వరకు ఆగితే కొంపలేం మునిగిపోవు అంటూ వ్యాఖ్యానించింది. వీటిని ఆపితే ఆక్రమణల తొలగింపు ఆలస్యమవుతుందన్న ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది.
ఈనెలలో ఇప్పటికే రెండుసార్లు వివిధ రాష్ట్రాలు చేపట్టిన బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేేసింది. దీన్ని హీరోయిజంగా చూపించే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించింది. తమ అనుమతులు లేకుండా కూల్చివేతలు చేపట్టొద్దని ప్రభుత్వాలకు సూచించింది. ఈఅంశంపై ఎలక్షన్ కమిషన్ కు నోటీసులు పంపిస్తామని స్పష్టం చేసింది.మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకశ్మీర్, హర్యానాల్లో మరికొన్ని నెలల్లో ఎన్నికలున్నాయి.
ఈతరుణంలో ఈసీకి నోటీసులిస్తామని సుప్రీంకోర్టు చెప్పడం.. ఆసక్తికరంగా మారింది. అయితే బహిరంగస్థలాలు, రైల్వే ఆస్తులు, నీటివనరుల ఆక్రమణల విషయంలో తమ ఆదేశాలు వర్తించబోవని సుప్రీంకోర్టు తెలిపింది. స్థానిక ప్రభుత్వాలు కూల్చివేతల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది.యూపీలో బుల్డోజర్ జస్టిస్ పై నమోదైన ఓ కేసును విచారిస్తూ… దేశవ్యాప్తంగా పెరుగుతున్న బుల్డోజర్ జస్టిస్ పై జస్టిస్ గవాయ్, విశ్వనాథన్ ల బెంచ్ తాజా ఆదేశాలను జారీ చేసింది.
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈకేసులో ప్రధాన పిటిషనర్ గా జమాత్ ఉలేమా హింద్ వ్యవహరిస్తోంది.కూల్చివేతలకు కనీసం 40 నుంచి 60 రోజుల ముందుగా నోటీసులివ్వాలని.. కూల్చివేతలకు సదరు అధికారులను బాధ్యులను చేయాలని సుప్రీంకోర్టుకు సదరు సంస్థ నివేదించింది. యూపీ సర్కార్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.