‘తెలుగు భాష పరిరక్షణపై మేధావులతో తానా సదస్సు
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం ‘నెల నెలా తెలుగు వెలుగు’ పేరిట నిర్వహిస్తున్న 71వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం ఈ వారం వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జయంతి (ఆగస్ట్ 29), ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ‘తెలుగు భాష పరిరక్షణ, పరివ్యాప్తి కోసం ఏం చేద్దాం?’ అనే అంశం మీద విస్తృతమైన చర్చ జరిగింది.
తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ ‘తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా తానా 50 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తోందని చెప్పారు. తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాల ద్వారా అమెరికాలో వేలాది మంది పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారని చెప్పారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ‘‘తెలుగును వ్యావహారిక భాషగా మార్చడంలో ఎంతోమంది ఛాందసువాదు లను ఒంటిచేత్తో ఎదుర్కొని, ఆ కృషిలో తన సర్వసాన్ని త్యాగం చేసిన ఏకవ్యక్తి సైన్యం, ధీశాలి గిడుగు వెంకట రామమూర్తి పంతులు జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ముదావహం అని చెప్పారు. కనీసం ఈరోజైనా మాతృ భాష పరిస్థితి ఎలా ఉంది, దాన్ని ఉన్నత స్థితిలో ఉంచడానికి తీసుకోవలసిన చర్యల గురించి ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు. ‘‘ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో కనీసం ప్రాధమిక స్థాయి వరకైనా తెలుగును తప్పనిసరి చేయాలి. వివిధ ప్రభుత్వ శాఖల్లో తెలుగు వాడకం పెరగాలి. ప్రభుత్వం, ప్రజలు, సంస్థలు, విద్యాల యాలు సమన్వయంతో పని చేసి తెలుగు భాషను పరిరక్షించుకోవాలసిన సమయం ఇది’’ అని ప్రసాద్ తోటకూర చెప్పారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘తెలుగువారు సాధించిన జ్ఞానం, విజ్ఞానం, అనుభవ సారం అంతా తెలుగు భాషలోనే నిక్షిప్తమై ఉందది. ఈ గొప్ప సంపదను భావితరాలు అందుకోవాలంటే వారికి మాతృభాష తెలిసి ఉండాలి’’ అని తెలిపారు.
చర్చలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ భాషా శాస్త్రజ్ఞుల సంఘం అధ్యక్షులు ఆచార్య డాక్టర్ గారపాటి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ‘‘భాష మీద ఆధారపడి 87% ఉత్పత్తులు, అమ్మకాలు, కొనుగోళ్ల వ్యవహారాలు జరుగుతున్నాయి. భాషా వినియోగంతోనే ఆర్ధిక ఆలంబన ఉంది. తెలుగు భాషా మాధ్యమం అమలు జరగకపోతే భవిష్యత్తులో భాషా సంక్షోభం ఏర్పడుతుంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడుతూ ‘‘కార్పోరేట్ విద్యా విధానం ద్వారా మాతృభాషకు ముప్పు ఏర్పడిరది. మాతృ భాషను నిలబెట్టుకోవడానికి ప్రజా ఉద్యమాలు అవసరం’’ అని చెప్పారు.
తెలుగు భాషోధ్యమ నాయకులు డాక్టర్ సామల రమేష్ బాబు మాట్లాడుతూ పట్టణాలతో పాటు గ్రామాలలో నివసిస్తున్న ప్రజల్లోకి తెలుగు భాషోధ్యమాన్ని తీసుకువెళ్ళడంలో గిడుగు కృషిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పూర్వ డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ నూర్ భాషా రహంతుల్లా ప్రాథమిక స్థాయిలో తెలుగు మాధ్యమం తప్పనిసరిగా ప్రవేశ పెట్టాలని, న్యాయవ్యవస్థలో తీర్పులు తెలుగులోనే ఉండాలని, తెలుగుమాధ్యమంలో చదువుకున్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలన్నారు. ‘‘వ్యక్తులు, వ్యవస్థల ద్వారానే భాషా పరిరక్షణ సాధ్యమని, తగు జాగ్రత్తలు తీసుకోకపోతే తెలుగుభాష కూడా అంతరించి పోయే ప్రమాదం ఉంది’’ అని భాషోద్యమ నాయకులు డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ అన్నారు.
‘అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్’ ద్వారా విదేశీయులకు తెలుగు మాట్లాడం, వ్రాయడంలో శిక్షణ ఇస్తున్న ఆచార్య డాక్టర్ కటికనేని విమల మాట్లాడుతూ ముందుగా భాషాతర్కాన్ని అర్ధం చేసుకోవాలని, కేవలం తెలుగు మాట్లాడమే గాకుండా రాయడం కూడా నేర్చుకోవాలన్నారు. నిజాం కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ చంద్రయ్య శివన్న మాట్లాడుతూ సామాజిక సమానత్వ విలువగా భాషా పరివ్యాప్తి జరగాలని, విద్యార్థులకు భాషపై పట్టును, వ్యక్తీకరణ సామర్థ్యం పెంపొదించే విధంగా రూపకల్పన జరగాలన్నారు. తెలుగుభాషను సులువుగా నేర్చుకునేందుకు వీలుగా ‘ఈ-బుక్’, ‘యాప్స్’, ‘ఆన్లైన్ నిఘంటువులు’ లాంటివి రూపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు అంతర్జాల సాంకేతిక నిపుణులు రహమానుద్దీన్ షేక్.
‘‘ఈమాట’’ పత్రిక సంస్థాపక సంపాదకులు, సురేష్ కొలిచాల మాట్లాడుతూ తెలుగు భాషను పరిరక్షించుకోవడంలో సరైన ప్రణాళికను అనుసరించకపోతే 22వ శతాబ్దంలో అంతరించ బోయే 90 శాతం భాషల్లాగే తెలుగుభాష కూడా తన మనుగడను కోల్పోవచ్చని హెచ్చరించారు. భాష మనుగడకు సురేష్ ఆరు సూత్రాలను ప్రతిపాదిం చారు. ఆచార్య విమల దగ్గర మూడు సంవత్సరాలగా తెలుగును ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్న విదేశీ వనిత యానా రెమిల్లార్డ్ మల్లవరపు అనర్గళంగా తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరచారు. ఆంగ్లం నేర్చుకోవడానికి ఉన్నట్లుగా తెలుగుభాష నేర్చుకోవడానికి ఎటువంటి ప్రాధమిక వ్యాకరణ గ్రంథాలు లేకపోవడం ఒక లోటు అన్నారు. కేవలం 18 నెలల వయస్సులో తన తల్లిదండ్రులతో పాటు కాకినాడనుండి వచ్చి అమెరికా దేశంలో స్థిరపడ్డ బిందు బచ్చు తనకు తెలుగుభాష పెద్దగా తెలియక పోయినా, మాతృదేశంలో ఉన్న బంధుమిత్రులతో మాట్లాడడానికి మాతృభాష చాలా అవసరం అని గుర్తించి, వివాహమై, పిల్లలు కల్గిన తర్వాత పట్టుదలతో తెలుగు నేర్చుకున్నానని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో తెలుగులోనే మాట్లాడడం ద్వారా ప్రవాసంలో మాతృభాషను నిలుపుకోవచ్చన్నారు. దుబాయిలో స్థిరపడిన ప్రశాంతి చోప్రా సభా ప్రారంభంలో సురేష్ కొలిచాల రచించిన ‘‘ఘనమైన మన భాష మన తెలుగు భాష’’ అనే పాటను శ్రావ్యంగా గానం చేశారు. తెలుగు మాట్లాడం రాకపోయినా 400కు పైగా తెలుగు పాటలను అతి శ్రావ్యంగా పాడగల పోలాండ్ దేశానికి చెందిన 15 సంవత్సరాల జాక్ చెర్ట్లూర్ ‘బ్రోచేవారెవరురా’, ‘వేదం అణువణున నాదం’, తరలి రాదా తనై వసంతం’ మొదలైన పాటలను ఎంతో శాస్త్రీయంగా, లయాత్మకంగా పాడి ఔరా అనిపించాడు.