తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయం
నిత్యావసర సరకులు, చీరలు, టవళ్ళు పంపిణీ
ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ఫౌండేషన్ ముందుకు వచ్చింది. తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు వరద బాధితులకు అవసరమైన నిత్యావసర వస్తువులను, ఇతర సహాయాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలప్రోలు గ్రామంలో వరద బాధితులకు అవసరమైన నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. దాదాపు 1645 బాక్స్లలో నిత్యావసర వస్తువులను ప్యాక్ చేయించి అందరికీ అందజేశారు. ఇంకా మరికొంతమందికి కూడా అందించనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి చెప్పారు. అలాగే చీరలు, టవళ్ళను కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణలోని వరద బాధితులకు కూడా సహాయాన్ని అందిస్తున్నట్లు శశికాంత్ వల్లేపల్లి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాజశేఖర్, హరేకృష్ణ మిషన్ ప్రతినిధి మహాక్రతు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తానా ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.