తిరుమలలో ఎన్నారైలు కుటుంబ సభ్యులతో దర్శనానికి అనుమతి ఇవ్వండి : ఎపి స్పీకర్కు, ఎన్నారై మంత్రికి తానా వినతి
తిరుమల శ్రీవారి దర్శనంలో ఎన్ఆర్ఐలకు ప్రస్తుతం అందిస్తున్న తాత్కాలిక పరిమితులను సడలించి, భారత పర్యటనకు వచ్చే ప్రవాసులతో పాటు వారి కుటుంబ సభ్యులు నలుగురికి స్వామివారి దర్శనానికి వెసులుబాటు కల్పించేలా ఆంధ్రప్రదేశ్ పభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తానా సభ్యత్వ ప్రయోజనాల కమిటీ సమన్వయకర్త సాయి బొల్లినేని అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఏపీ ఎన్నారై వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్లకు వినతిపత్రాన్ని సమర్పించారు. తిరుమలలో ఎన్ఆర్ఐ కోటాదర్శనం విధానంలో సవరణ చేయాలని కోరారు. ఈ సవరణ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి తానా సిద్ధంగా ఉందని సాయి తెలిపారు. దీనికి స్పీకర్, మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం తదితరులు పాల్గొన్నారు.
భారతదేశం వెళ్లిన తెలుగు ప్రవాసులు తిరుమలలో కొలువైన ఆ శ్రీవేంకటేశ్వరుడిని దర్శనం చేసుకోని వారు ఉండరు. ఇండియా ట్రిప్ లో ప్రవాసులకు టైం చాలా తక్కువుంటుంది. ఈ తక్కువ టైంలో శ్రీవారిని దర్శించుకోవడం కొంచెం వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియగా మారింది.అందువలన తిరుమల ఎన్ఆర్ఐ కోటా దర్శనంలో ఎన్ఆర్ఐలకు భారతదేశంలో నివసిస్తున్న కుటుంబ సభ్యులతో కలిసి దివ్య దర్శనం చేసే సౌలభ్యం కల్పించాలి అంటూ తానా మెంబర్షిప్ బెనిఫిట్స్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని ప్రతిపాదన చేశారు.
తిరుమల ఎన్ఆర్ఐ కోటా దర్శనం విధానంలో సవరణ చేయాలని ప్రతిపాదన లేఖను సమర్పించారు. ఈ ప్రతిపాదన ప్రకారం, ఎన్ఆర్ఐలకు ప్రస్తుతం లభించే దర్శనంలో ఉన్న తాత్కాలిక పరిమితులు తొలగించి, ఎన్ఆర్ఐ తో పాటు భారత దేశంలో నివసిస్తున్న నలుగురు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు కూడా పాల్గొనే సౌకర్యం కల్పించాలని, ఎన్ఆర్ఐ భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి భక్తిపూర్వకంగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఇవ్వాలని కోరటం జరిగినది. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు శ్రీ జయరాం కోమటి పాల్గొని, ఈ సవరణ ఆవశ్యకతను స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి, మరియు ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి సహేతుకంగా వివరించి ఎన్ఆర్ఐ భక్తులు కుటుంబంతో కలిసి తిరుమల దర్శనం చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది.