TTDP: తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం రానుందా..!?
దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగువారి సేవలో తరిస్తోంది తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ సొంతం. 1983లో ఎన్టీఆర్ (NTR) పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీ అధికారంలోనో, ప్రతిపక్షంలోనో ఉంటోంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. విభజన తర్వాత తెలంగాణలో (telangana) కూడా టీడీపీ సత్తా చాటినా దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ తెలంగాణలో పట్టుకోసం టీడీపీ ప్రయత్నిస్తోంది.
2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. అప్పుడు ఏపీలో అదికారాన్ని దక్కించుకుంది టీడీపీ. ఆ ఎన్నికల్లో తెలంగాణలో కూడా 15 సీట్లలో తెలుగుదేశం గెలిచింది. అయితే గెలిచిన వాళ్లందరినీ బీఆర్ఎస్ (BRS) లాగేసుకుంది. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కూడా టీడీపీ తెలంగాణలో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో 2 స్థానాలను చేజిక్కించుకుంది. అయితే వీళ్లు కూడా పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో తెలంగాణలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే ఇప్పటికీ తెలంగాణలో గణనీయమైన ఓటుబ్యాంకును (vote bank) టీడీపీ కలిగి ఉంది. ఆ పార్టీని అభిమానించే వాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
తెలంగాణలో తెలుగుదేశం ప్రభావాన్ని తెలుసుకున్న పార్టీలు ఆ పార్టీ అభిమానుల ఓట్లకోసం పరితపిస్తుంటారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా పార్టీ ఏదైనా టీడీపీ సన్నిహిత ఓటర్లకోసం ప్రయత్నిస్తుంటారు. 2023 ఎన్నికల్లో టీడీపీ ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది. ఈ ఓట్లన్నీ కాంగ్రెస్ (Congress) పార్టీకి పడ్డట్లు అంచనా. చంద్రబాబునాయుడితో (Chandrababu Naidu) రేవంత్ రెడ్డికి (Revanth Reddy) సాన్నిహిత్యం ఉంది. అందుకే టీడీపీ పోటీ చేయలేదని అందరూ అనుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. దీంతో తెలంగాణలో పార్టీని మళ్లీ బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ప్రతినెలా రెండో శనివారం హైదరాబాద్ (Hyderabad) లో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అవుతున్నారు.
పార్టీకి దూరమైన కొంతమంది నేతలు ఇప్పుడు మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారు. హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy).. తాజాగా చంద్రబాబును కలిసి త్వరలో పార్టీలో చేరబోతున్నట్టు చెప్పారు. అలాగే.. మల్లారెడ్డి (Malla Reddy) సహా పలువురు నేతలు టీడీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందనే ప్రచారం కొంతకాలంగా వినిపిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పలువురు నేతలు ఆయన్ను కలిశారు. దీంతో ఇలాంటి ప్రచారాలు ఎక్కువయ్యాయి. అయితే బలమైన నేతలను చేర్చుకోవడం ద్వారా పార్టీని మళ్లీ గాడిన పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు సమాచారం.