ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నా.. వారిని కఠినంగా : వర్ల రామయ్య
ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలతో ఢీకొట్టిన ఘటన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, తలశీల రఘురాంల కుట్రేనని టీడీపీ పొటిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల జగన్ పాలన అంతా అరాచకమని మండిపడ్డారు. కుట్రలు, కుతంత్రాలతో వైఎస్ జగన్ పాలన సాగించారని విమర్శించారు. జగన్ పాలన అంతా నేరపూరితమేనన్నారు. జాతీయ సంపదైన ప్రకాశం బ్యారేజీని కుట్రతో ధ్వంసం చేయాలనుకున్నారని, ఇది దేశ ద్రోహం నేరంతో సమానమని మండిపడ్డారు. చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయాలని కుట్ర పన్ని పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టేలా వ్యూహం పన్నారని ధ్వజమెత్తారు. ఆ పడవలు సరిగ్గా బ్యారేజీని ఢీకొని ఉంటే గ్రామలన్నీ మునిగిపోయి ప్రజలు ధన, ప్రాణాలు కోల్పోయే వారన్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో ఇది కుట్ర అని, ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నా వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.