హైడ్రా మరింత శక్తివంతం..చట్టబద్దం చేసే దిశగా రేవంత్ సర్కార్..
చెరువుల ఆక్రమణలను నేలమట్టం చేస్తూ.. అక్రమ కట్టడాల ఓనర్లలో ఆందోళనను పెంచుతున్న హైడ్రా.. ఇక మరింత శక్తిమంతం కానుంది. ఎందుకంటే.. దీనిని చట్టబద్దం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లోని సర్కారు ప్రయత్నిస్తోంది. ఈ నెలలో జరగనున్న కేబినెట్ సమావేశంలో హైడ్రాకు సంబంధించిన ముసాయిదా చట్టానికి ఆమోదం తెలపనున్నారు. అనంతరం.. జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనిని చట్టం చేయనున్నారు. దీంతో మరింత బలంగా హైడ్రా పనిచేయనుంది.
హైడ్రా ప్రకటన వెలువడిన సమయంలో ఏముందిలే .. అన్నివ్యవస్థల్లా ఇది ఓ వ్యవస్థే అని ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఎప్పుడైతే కూల్చివేతలు స్టార్టయ్యాయో.. అప్పటి నుంచి హైడ్రాకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.ఆక్రమణలు కూల్చివేతలు కొనసాగుతుండడంతో.. పలువురు హైకోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే. అప్పట్లోనే హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. అయితే..సర్కారు వివరణ ఇస్తూ.. జూలై 19న జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసినట్టు తెలిపింది.
హైడ్రా ఏర్పాటు, చట్టబద్ధతపై మాత్రం ఇంకా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. అయితే.. సర్కారు మాత్రం హైడ్రాను చట్టబద్ధమైనదేనని చెబుతోంది. ఎగ్జిక్యూటివ్ తీర్మానం ద్వారా హైడ్రాను ఏర్పాటు చేశారు. సో.. దీనికి పవర్స్ ఉన్నాయన్నది అధికారుల వాదన. అయినా.. కూడా చట్టబద్ధత కల్పించేందుకు సర్కారు ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా చట్టాన్ని ఈ నెలలోనే మంత్రివర్గం ఆమోదించనుంది. అనంతరం.. అసెంబ్లీలోనూ ప్రవేశ పెట్టి ఆమోద ముద్ర వేయించనుంది. దీంతో వాల్టా, మున్సిపల్, జీహెచ్ఎంసీ, నీటిపారుదల చట్టాల్లోని విశేషాధికారాలు హైడ్రాకు దఖలు పడనున్నాయి.