జానీ మాస్టర్పై అత్యాచారం కేసు
ఈ మధ్య వరుస వివాదాలతో కొందరు సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తున్నాయి. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో పాపులర్ అయిన కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా ఏదొక వివాదంలో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా 21 ఏళ్ల మహిళా కొరియోగ్రఫర్ ఒకరు జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసును పెట్టింది.
ఆమెపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆయనపై బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు జానీ మాస్టర్ పై జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం బాధితురాలుండే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేశారు. వివిధ నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్స్ కు వెళ్లే టైమ్ లోనూ, హైదరాబాద్లోని తన నివాసమైన నార్సింగ్లోనూ జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆమె పేర్కొంది.
వాస్తవానికి ఈ కంప్లైంట్ ఫిర్యాదు చేసి రెండ్రోజులవుతుంది కానీ బయటకు మాత్రం ఆలస్యంగా వచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు జానీ మాస్టర్ మీద అత్యాచారం, బెదిరింపులకు పాల్పడటం, గాయపరచడం తదితర ఆరోపణలతో కేసు నమోదు చేశారు. గతంలో కూడా పలు వివాదాల్లో జానీ మాస్టర్ పేరు వార్తల్లోకొచ్చింది. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన తర్వాత నుంచి ఆయన పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు.