ఆంధ్రా లో లడ్డు పాలిటిక్స్..ఇది నిజమా లేక రాజకీయమా..
అత్యంత పవిత్రమైన తిరుమల లో వేంకటేశ్వరుని ప్రసాదం అయిన తిరుపతి లడ్డు పై ప్రస్తుతం జరుగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. శ్రీవారి నైవేద్యమైన లడ్డూలో జంతువుల కొవ్వు ఉపయోగించారు అని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. దేవుడిని కూడా రాజకీయాల కోసం ఉపయోగించడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ప్రవేశించే నేతికి నాణ్యత పరీక్షల విధానాలలో ఎటువంటి మార్పులు జరగలేదని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఏ పద్ధతిలో జరుగుతుందో తాము అదే పద్ధతిని కొనసాగించామని.. చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా ఎటువంటి కల్తీ జరగలేదని జగన్ పేర్కొన్నారు. తిరుమలకు నేయి సరఫరా కోసం ఆరు నెలలకు ఒకసారి టెండర్లను పిలిచి.. అనంతరం ఎల్ 1 కాంట్రాక్టర్ కు ఈ బాధ్యత అప్పగిస్తారని జగన్ పేర్కొన్నారు. నెయ్యి తెచ్చే ప్రతి ట్యాంకర్ కు NABL సర్టిఫికెట్ కంపల్సరిగా ఉండాలని.. నేయి శాంపిల్స్ను మూడుసార్లు పరీక్షించాకే ట్యాంకర్ ను టీటీడీ అధికారులు లోనికి అలోవ్ చేస్తారని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు ఓ కట్టుకథ అని పేర్కొన్న జగన్.. చంద్రబాబు చెప్పిన మాటలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి అని అన్నారు.
అంతేకాదు జూలై 11న శాంపిల్స్ తీసుకుంటే జులై 17న అవి పరీక్షల కోసం NDDBకి పంపారు.. రిపోర్ట్లు జూలై 23న వచ్చాయి.. అలాంటప్పుడు ఆ పీరియడ్లో ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు అని జగన్ ప్రశ్నిస్తున్నారు. రెండు నెలల కింద వచ్చిన నివేదికపై అప్పుడే స్పందించకుండా ఇప్పటివరకు ఎందుకు ఆగారు అని అడుగుతున్నారు. కేవలం టీడీపీ ఇచ్చిన హామీల గురించి ప్రజలు ప్రశ్నించకుండా చంద్రబాబు దీన్ని ఒక డైవర్షన్ గా వాడుతున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. మరోపక్క టీడీపీ తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి అని ఆరోపిస్తోంది. ఇందులో నిజం ఎవరి పక్షాన ఉందో తెలియదు కానీ ప్రస్తుతానికి తిరుమల లడ్డు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. విషయం రాష్ట్రాన్ని దాటి కేంద్రం వరకు వెళ్ళింది.. ఇక ఈ విషయంలో ముందు ముందు ఎన్ని ట్విస్టులు ఉన్నాయో చూడాలి..