Tirumala Laddu: దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచుతారా..!?
తిరుమల లడ్డూలో (Tirumala Laddu) కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కల్తీ నెయ్యిపై (adulterated ghee) విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టులో (Supreme Court) దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి (Subramanya Swamy), వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో (YV Subba Reddy) పాటు పలువురు ఈ అంశంపై విచారణ కోరారు. జస్టిస్ బి.ఆర్.గవాయ్, కె.వి.విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం అనేది కోట్లాది మంది భక్తులతో ముడిపడిన వ్యవహారమని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాంటి కీలకమైన అంశాన్ని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) రెండో ఒపీనియన్ తీసుకోకుండానే మీడియా (Media) ముందు మాట్లాడడాన్ని తప్పుబట్టింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించింది. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనడానికి ఆధారాలేమైనా ఉన్నాయా అని ధర్మాసనం ప్రశ్నించింది. లడ్డూల్లో కల్తీ జరిగిందని చెప్పేందుకు వాటిని పరీక్షించారా అని ప్రశ్నించింది. ఎన్డీడీబీ ల్యాబ్ (NDDB Lab) కాకుండా మైసూర్ లేదా ఘజియాబాద్ లోని ఇతర ల్యాబుల్లో సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సింది కదా అని నిలదీసింది. ఎస్ వాల్యూలో తేడాలకు ప్రయోగశాలల్లో వివిధ అంశాలు కారకాలుగా ఉంటాయని పేర్కొంది.
మీడియా ముందు ఇలాంటి సున్నితమైన అంశాలపై మాట్లాడడంపై తన క్లయింట్స్ ను సంయమనం పాటించాల్సిందిగా ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాకు (Siddharth Luthra) సూచించింది ధర్మాసనం. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నేతలు ఇలా మాట్లాడడం సరికాదని అభిప్రాయపడింది.
మరోవైపు తిరుమల ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడారనదే నిజమైతే అది క్షమించరాని నేరమని.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor General Thushar Mehta) అభిప్రాయపడ్డారు. ఇది కోట్లాదిమంది భక్తులకు సంబంధించిన వ్యవహారం అన్నారు. ఈ వ్యవహారంపై ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం .. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (SIT) దర్యాప్తు సరిపోతుందా.. లేదంటే స్వతంత్ర విచారణ జరపాలా అని సొలిసిటర్ జనరల్ ను ప్రశ్నించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏంటో చెప్పాలంటూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.