ఇండియన్స్ కు దుబాయి ఆన్ అరైవల్ వీసా..
యూఏఈలో పర్యటించాలనుకుంటున్న భారతీయులకు ఆదేశం గుడ్ న్యూస్ వినిపించింది. వీసా లేకున్నా అక్కడ పర్యటించేందుకు అవకాశం కల్పిస్తోంది. అదెలా అంటే..భారత్లో వీసా తీసుకోకపోయినా యూఏఈ లేదా దుబాయ్లో దిగిన తర్వాత కూడా పొందే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చారు. అర్హత కలిగిన భారతీయ ప్రయాణికులు ఈ వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని యూఏఈవోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. యూఏఈ ఎయిర్పోర్టులో దిగిన వెంటనే అక్కడ ఉండేందుకు 14 రోజుల వీసా పొందే వీలు ఉంటుంది.
భారత్ నుంచి ఏటా వేలాది మంది యూఏఈకి వెళ్తుంటారు. కొందరు చదువు కోసం, కొందరు ఉద్యోగాలు, ఉపాధి కోసం మరికొందరు విహార యాత్ర కోసం పర్యటిస్తారు. కొందరు అక్కడే స్థిరపడతారు. వారిని చూసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వెళ్లొస్తుంటారు. ఇలాంటివారు పాస్పోర్టు, వీసా కలిగి ఉండాలి. అయితే తాత్కాలికంగా యూఏఈ వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి భారత ఎంబసీ అక్కడే వీసా తీసుకునే అవకాశం కల్పించింది.
ఎయిర్ పోర్టులో వీసా…
యూఏఈ వెళ్లే భారతీయులు అక్కడి ఎయిర్పోర్టులో దిగిన వెంటనే వీసా జారీ చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దీనికోసం వీసా ఆన్ అరైవల్ను యూఏఈ అందుబాటులోకి తెచ్చింది. దీంతో అర్హులు 14 రోజుల గడువుతో వీసా పొందే అవకాశం ఉంది. అయితే ఈ వీసా ఆన్ అరైవల్ అందరికీ వర్తించదని తెలిపింది. అర్హులు మాత్రమే పొందే వీలుంటుంది.
అర్హులెవరంటే...?
అమెరికా జారీ చేసిన గ్రీన్కార్డు లేదా యూఏఈలో చెల్లుబాటు అయ్యే వీసా యూరోపియన్ యూనియన్ దేశాలు ఇచ్చే రెసిడెన్స్ లేదా యూకే దేశాలు ఇచ్చిన రెసిడెన్స్, వీసాలు కలిగి ఉన్నవారు మాత్రమే ఈ వీసా పొందవచ్చని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. కనీసం.. ఆరు నెలలు చెల్లుబాటు అయ్యే పాస్ట్పోర్టు ఉండేలా చూసుకోవాలని వెల్లడించింది. అయితే వీసా ఆన్ అరైవల్ కింద మొదట 14 రోజులు వ్యవధితో వీసా అందిస్తారు. పరిస్థితిని బట్టి దానిని మరో 14 రోజులు పొడిగిస్తారు. ఒకవేళ పొడిగింపు వీలుకాని పక్షంలో...60 రోజుల వ్యవధితో కూడిన వీసా కూడా తీసుకునే వెసులుబాటు ఉంటుంది.