భారతీయులకు రష్యా గుడ్ న్యూస్... వీసాలేకుండా పర్యటనలకు ఛాన్స్
భారత్ కు చిరకాల మిత్రదేశం రష్యా... భారతీయులకు గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే అంటే 2025 నుంచి వీసా రహిత పర్యటనకు అనుమతించనుంది. దీనికి సంబంధించిన ఒప్పందం.. కీలక దశలో ఉందని రష్యా ఉన్నతాదికారులు చెబుతున్నారు. దీనివల్ల భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని రష్యా అధికారులు భావిస్తున్నారు. టూరిజం విషయంలో భారత్.. ఇప్పటికే రష్యాకు పెద్ద మార్కెట్ గా అవతరించింది. ఈ ఏడాది తొలి ఆరునెలల్లోనే 28,500 మంది మాస్కోలో పర్యటించారు.
గతేడాది ఇదే సమయంతోపోలిస్తే పర్యాటకు సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరిగింది. ముఖ్యంగా వ్యాపారం, ఇతర అంశాలకు సంబంధించి రష్యాలో భారతీయుల పర్యటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారత్ తో ఉన్న సాన్నిహిత్యం, స్నేహం వల్ల ...ఇండియాకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు రష్యా అధికారులు చెబుతున్నారు. 2023 ఆగస్టు నుంచి రష్యాలో పర్యటించాలనుకున్న భారతీయులకు.. ఈ-వీసా సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
గతేడాది రష్యా వీసాలు పొందిన దేశాల్లో భారత్.. ఐదోస్థానంలో నిలిచింది.గతేడాది మొత్తం 9,500 మంది భారతీయులకు రష్యా వీసాలు లభించాయి. ఇది మాస్కోకు వచ్చే వారికి సంబంధించి 6 శాతమని రష్యా ఎంబసీ అధికారులు చెబుతున్నారు. ఏడాది పొడుగునా పండుగలు, సదస్సులతో ప్రపంచ వాణిజ్య కేంద్రంగా మాస్కో మారుతోందంటున్నారు రష్యన్ అధికారులు. ముఖ్యంగా భారతీయ వివాహ వేడుకలకు రష్యాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించేందుకు వీలుగా పలు ఆకర్షణీయ ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు. దీనివల్ల రష్యాకు పర్యాటకపరంగా ఆదాయం పెరగనుంది. ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం కానుంది.