సియోల్లో తెలంగాణ మంత్రుల బృందం పర్యటన
ఒకప్పుడు మురికికూపంలా ఉన్న చుంగేచాన్ ఉపనదిలో ఇప్పుడు శుభ్రమైన నీరు ప్రవహిస్తోందని, ఇదే తీరులో హైదరాబాద్లోని మూసీని పునరుజ్జీవం చేయాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవ పథకంలో భాగంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో తెలంగాణ బృందం దక్షిణకొరియా రాజధాని సియోల్లో పర్యటిస్తోంది. సోమవారం అక్కడి చుంగేచాన్ తీరాన్ని, వ్యర్థాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న కేంద్రాలను బృందం సందర్శించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రకాశ్గౌడ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, మూసీ పరీవాహక అభివృద్ధి సంస్థ జేఎండీ గౌతమి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హనుమంతరావు తదితరులు ఈ పర్యటనలో ఉన్నారు.