YS Jagan – Tirumala: తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్..! తప్పు చేశారా..!?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ శనివారం తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకోబోతున్నారని తెలియగానే అందరి చూపూ అటవైపు మళ్లింది. శుక్రవారం సాయంత్రం అయన తిరుమల చేరుకుని శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకునేలా షెడ్యూల్ రెడీ అయింది. అనూహ్యంగా తిరుమల పర్యటనను జగన్ రద్దు చేసుకున్నారు. తన పర్యటన రద్దుకు దారి తీసిన కారణాలను ఆయన ప్రెస్ మీట్ (Press Meet) పెట్టి మరీ చెప్పారు. వైసీపీ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని.. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ (BJP) నేతలను రప్పిస్తున్నారని.. అందుకే తాను పర్యటనను పోస్ట్ పోన్ చేసుకున్నా అని జగన్ వెల్లడించారు.
జగన్ తిరుమల పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తుందని అందరూ భావించారు. వైసీపీ, కూటమి పార్టీలు (NDA Alliance Parties) దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. తిరుమల లడ్డూ (Tirumala Laddu) పవిత్రతను దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడారని.. ఆయన పాపాలకు పరిహారంగా శనివారం అన్ని గుళ్లల్లో పూజలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా జగన్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారు. అయితే ఆయనతో డిక్లరేషన్ (declaration) తీసుకోవాలనే డిమాండ్ మొదలైంది. ఆయన క్రైస్తవుడు (Christian) కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని కూటమి పార్టీల నేతలు డిమాండ్ చేశారు.
అయితే వైసీపీ మాత్రం డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పింది. వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR), తర్వాత జగన్ ఎన్నోసార్లు తిరుమలేశుడిని దర్శించుకున్నారని అప్పుడు అడగని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించింది. ఇదే సమయంలో వైసీపీ శ్రేణులకు నోటీసులివ్వడం, జగన్ టూర్ లో పాల్గొనొద్దని ఆదేశాలివ్వడం లాంటివి వైసీపీకి నచ్చలేదు. అందుకే జగన్ తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన లడ్డూ వివాదంపై మరోసారి సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
భారతదేశం (India) సెక్యులర్ (Secular) దేశం అని.. ఎవరైనా ఎలాంటి మతమైనా (religion) అనుసరించవచ్చని జగన్ చెప్పుకొచ్చారు. తననే గుడికి రాకుండా అడ్డుకుంటే ఇక బడుగు బలహాన వర్గాలు ఎలా వెళ్తాయని ప్రశ్నించారు. తన మతమేంటో ఇప్పుడు అడుగుతున్నారని.. ఇదేం న్యాయమని ప్రశ్నించారు. అయితే మతపరమైన అంశాల్లో రాజ్యాంగం (constitution) కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. ఆయా మతాల సంప్రదాయాలకు అనుగుణంగా ఎవరైనా నడుచుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ భారతదేశం సెక్యులర్ కాబట్టి ఎవరు ఎక్కడికైనా వెళ్తామంటే కుదరదు. హిందూయేతరులు తిరుమల గుడికి (temple) వెళ్లాలంటే కచ్చితంగా ఆ దేవుడిపై విశ్వాసం ఉన్నట్టు ప్రకటించాలి. అది నియమం. దాన్ని రాజకీయం చేసి ముఖ్యమంత్రిగా పని చేసిన నాకే గుడిలోకి అనుమతి లేకపోతే ఇక దళితులను (Dalit) రానిస్తారా అని ప్రశ్నించడం అమాయకత్వమే అనుకోవాలి.