లీడర్ అంటే ఇలా ఉండాలి జగనన్నా..? వైసీపీ నేతల అంతర్మథనం..!
ఇటీవలి ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి వైఎస్ జగన్..రాజకీయంగా యాక్టివిటీ తగ్గించేశారు. బెంగుళూరు, ఆంధ్ర మధ్య రాకపోకలతోనే సగం సమయం గడిచిపోతోంది. దీనికి తోడు పార్టీ నుంచి పలువురు సీనియర్లు వేర్వేరు కారణాలు చూపుతూ జంపైపోతున్నారు.వెళ్లిపోయిన వాళ్లని పోనీయండి..వారిని గడ్డం పట్టుకుని ఆపుతామా .. మనం అలాంటి వారిని చాలా మందిని తయారు చేద్దామని జగన్.. నేతల సమక్షంలో చెప్పడం జరిగింది. కానీ..మాటలకే పరిమితమవుతున్నారని.. చేతల్లో చూపడం లేదన్న ఆందోళన సదరు క్యాడర్ లో వ్యక్తమవుతోంది.
అయితే.. ఇటీవలి కాలంలో కాస్త మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.కీలకనేతలు పార్టీ ఫిరాయిస్తుండడంతో క్యాడర్ లో ధైర్యం నింపేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ... ఈ సమావేశాల్లో సైతం తాను చెప్పిందే నేతలు వినాలన్న ధోరణితో జగన్ కనిపిస్తుండడం.. పార్టీ నేతలు, కార్యకర్తలను నిరాశకు గురిచేస్తోంది. మీరు మారాాలి.. మీరు మారాలి అనడమే తప్పా.. జగన్ ఎప్పుడు మారతారబ్బా అన్న చర్చ..పార్టీ నేతల్లో అంతర్గతంగా వినిపిస్తోంది. ప్రజల్లో ఉండాలంటూ.. నాయకులకు, కార్యకర్తలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తాజాగా సెలవిచ్చారు. ‘ప్రజల్లో ఉంటేనే గుర్తింపు ఉంటుంది. వారు మనల్ని గుర్తు పెట్టుకుంటారు. మీరు నిరంతరం ప్రజల్లో ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు. తాజాగా వైసీపీ నేతలతో ఆయన వర్క్ షాపు నిర్వహించారు.
ఈ సందర్భంగానే వారికి ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. ఇది మంచిదే. ఎవరూ కాదనరు. కానీ, అసలు ప్రజల్లో ఉండాల్సింది ఎవరు? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. ఓడిపోయిన పార్టీకి ప్రజలలో ఆదరణ పెద్దగా ఉండదు. పైగా కార్యకర్తలు, నేతలు ముందుకు వెళ్లినా.. వారికి నిరసన సెగ తగులుతుంది. ఇది అన్ని పార్టీలకూ కామనే. గతంలో 2019-24 మధ్య టీడీపీ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు వచ్చేందుకు భయపడ్డారు. ఈ సమయంలో మీ కంటే ముందు నేనే ప్రజల్లో ముందుంటానంటూ.. చంద్రబాబు బయటకు వచ్చారు. ఆయనే నేరుగా కార్యక్రమాల్లో ముందు పాల్గొన్నారు. దీంతో కార్యకర్తలు, నాయకుల్లో చైతన్యం వచ్చింది. టీడీపీ పుంజుకునేందుకు బాటలు పడ్డాయి.
ఈ క్రమంలో చంద్రబాబు తన వయసును, ఇతరత్రా సమస్యలను కూడా పట్టించుకోకుండానే ముందుకు సాగారు. మరి.. ఇలాంటి పరిస్థితే వైసీపీలోనే ఉంటుంది కదా? ఈ విషయాన్ని జగన్ విస్మరిస్తున్నారని.. క్యాడర్ అంతర్గత సంభాషణల్లో వినిపిస్తోంది. ముందు రావాల్సింది.. ముందు నిలబడాల్సింది కూడా జగనే. పార్టీ బలోపేతం అనేది నాయకుడు వ్యవహరించే తీరును బట్టే ఉంటుంది. కానీ, ఈ చిన్న సూత్రాన్ని జగన్ మరిచిపోయినట్టుగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా ఉంది. కానీ, ఇది సరైన పద్ధతి కాదని, మీరు బెంగళూరులోను, తాడేపల్లిలోనూ కూర్చుంటే మేం ప్రజల్లో తిరిగితే ఫలితం ఉండదని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.