YS Sharmila : ఏపీ కాంగ్రెస్ను షర్మిల నాశనం చేస్తోందా..!?
దాదాపు 40 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ (Congress Party). తెలుగుదేశం పార్టీ (TDP) ఆవిర్భావం వరకూ ఆ పార్టీది ఏకఛత్రాధిపత్యం. టీడీపీ పురుడుపోసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం దొరికింది. అంతవరకూ ఆ పార్టీకి తిరుగులేకుండా పోయింది. అంతెందుకు.. 2014లో రాష్ట్ర విభజన జరిగేంత వరకూ కాంగ్రెస్ పార్టీ అటు అధికారంలోనో, ఇటు ప్రతిపక్షంలోనో ఉండేది. కానీ పదేళ్లుగా ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆ పార్టీని మళ్లీ గాడిన పెట్టేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) వారసురాలు వైఎస్ షర్మిలను నమ్ముకుంది కాంగ్రెస్ హైకమాండ్.
అయితే వైఎస్ షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీ కాంగ్రెస్ మరింత దిగజారిపోతోందనేది ఆ పార్టీ నేతల మాట. షర్మిల తన స్వప్రయోజనాలకోసం పార్టీని ఫణంగా పెడుతున్నారని ఆ పార్టీ నేతలు పలువురు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) నుంచి రావాల్సిన వాటాలను రాబట్టుకోవడం కోసం పార్టీని ఆమె అడ్డంగా పెట్టుకుంటున్నారని విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ను విమర్శిస్తే పర్లేదు కానీ.. ఓడిపోయిన తర్వాత కూడా ఆయనపై షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారంటే అది వ్యక్తిగతమేననేది ఏపీ కాంగ్రెస్ నేతల మాట.
ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడారు. హర్యానా ఎన్నికల్లో (Haryana Electoins) ఈవీఎంలపై (EVM) కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. దానికి మద్దతుగా జగన్ (YS Jagan) కూడా ఈవీఎంలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు. వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీకి ప్లస్. అయితే షర్మిల మాత్రం జగన్ ను విమర్శించింది. పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం తన వ్యక్తిగత స్వార్థం కోసమే షర్మిల వ్యవహరిస్తున్నారని ఈ విషయం మరోసారి రుజువు చేసిందని కాంగ్రెస్ పార్టీ నేతలు దుయ్యబడుతున్నారు. తాజాగా ఫీజు రీఎంబర్స్ మెంట్ (Fee Reimbursement) విషయంలో ప్రస్తుత చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వాన్ని వదిలేసి ఓడిపోయిన జగన్ దే తప్పు అన్నట్టు షర్మిల విమర్శించడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది.
వైఎస్ షర్మిల పీసీసీ (PCC ) పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీ కాంగ్రెస్ నేతలెవరూ ఆమెతో సఖ్యంగా లేరు. పల్లంరాజు, జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు, చింతామోహన్, శైలజానాథ్.. ఇలా ఎంతోమంది నేతలు కాంగ్రెస్ లో కీలకంగానే ఉన్నారు. అయితే వీళ్లెవరూ షర్మిల కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. షర్మిలే అడపాదడపా తన వెంట పది మందిని వేసుకుని హడావుడి చేస్తున్నారు. ఇందులో పెద్దనేతలెవరూ ఉండట్లేదు. షర్మిల వైఖరే ఇందుకు కారణమని నేతలు చెప్తున్నమాట. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే త్వరలోనే షర్మిల స్థానంలో మరొకరిని పీసీసీ చీఫ్ గా నియమించే అవకాశాలున్నాయనే టాక్ ఏపీ కాంగ్రెస్ లో వినిపిస్తోంది.