చంద్రబాబుతో వైఎస్ సునీతా భేటీ..! వివేకా హత్య కేసు విచారణ వేగవంతం..?
ఆంధ్రప్రదేశ్ లో అత్యంత సంచలనం కలిగించిన వాటిల్లో వైఎస్ వివేకా హత్యకేసు ఒకటి. 2019 ఎన్నికలకు ముందు ఈ హత్య జరిగింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసును అప్పటి సీఐడీ విచారణ చేపట్టింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఈ కేసులో పెద్దగా పురోగతి లేదు. వైఎస్ జగన్ కుటుంబీకులే ఈ హత్యలో నిందితులుగా ఉండడంతో ఇది ముందుకు సాగట్లేదని వైఎస్ వివేకా కుటుంబీకులు ఆరోపిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు జగన్ ఓడిపోయి చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఈ కేసు విచారణ ఊపందుకుంటుందని అంచనా వేస్తున్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న హత్యకు గురయ్యారు. పులివెందులలోని తన నివాసంలో బాత్రూంలో విగతజీవిగా కనిపించారు. మొదట ఇది ఆత్మహత్య అని అందరూ నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన శరీరంపై తీవ్ర గాయాలు ఉండడంతో ఇది హత్య అని నిర్ధారించారు. దీనిపై విచారణ జరిపించాలని.. ఈ హత్య వెనుక చంద్రబాబు ప్రభుత్వ హస్తం ఉందని అప్పట్లో జగన్ సహా వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. సీఐడీ విచారణపై తమకు నమ్మకం లేదని.. సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఆ తర్వాత కొన్ని నెలలకే చంద్రబాబు ఓడిపోయి జగన్ అధికారంలోకి వచ్చారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు ఆయన ససేమిరా అన్నారు. ఈ హత్యలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సహా పలువురి హస్తం ఉందని.. కచ్చితంగా సీబీఐ విచారణ జరిపించాలని వివేకా కుమార్తె సునీత పట్టుబట్టారు. కోర్టును ఆశ్రయించారు. చివరకు ఆదేశాల మేరకు ఇది సీబీఐ విచారణకు వెళ్లింది. దీనిపై సీబీఐ పలుమార్లు కడప, పులివెందుల, హైదరాబాద్, విజయవాడల్లో విచారణ జరిపింది. అయితే అప్పటి పోలీసులు, అధికారులు, నేతలు సీబీఐకి సహకరించలేదు. పైగా సీబీఐ నేతలపైనే స్థానిక పోలీసులు కేసు పెట్టారు. దీంతో సీబీఐ ఆశ్చర్యపోయింది. ప్రభుత్వం సహకరించట్లేదని కోర్టుకు వివరించింది. సీబీఐకి అడుగడుగునా ఆటంకాలు కల్పించడంతో ఇది ముందుకు సాగలేదు.
ఇప్పుడు జగన్ ఓడిపోయి చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఈ కేసు కొలిక్కి వస్తుందని సునీత నమ్ముతోంది. అందుకే నేరుగా ఆయన్ను కలిసి వివేకా హత్యకేసు విచారణను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. ఆయన కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ కేసులో అవినాశ్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. సీబీఐ కూడా ఆయన్ను నిందితుడిగా చేర్చింది. అందుకే జగన్ కేసును ముందుకు సాగకుండా అడ్డుకున్నారనే అపవాదు ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సీబీఐకి సహకరిస్తే కచ్చితంగా ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.