ASBL Koncept Ambience

తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రండి...

తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రండి...

ఐటీ సర్వీసెస్‌ కంపెనీ ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్‌ పిలుపు

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీసెస్‌ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. డల్లాస్‌లో ఐటీ సంస్థల అసోసియేషన్‌ ఐటి సర్వ్‌ అలయన్స్‌ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం పంచుకోవాలని  కోరారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లను నిర్మించుకున్నాం. ఇప్పుడు మనందరం కలిసి  ప్రపంచ స్థాయి నాల్గవ నగరంగా ఫ్యూచర్‌ సిటీని తయారు చేసుకుంటున్నాం. హైదరాబాద్లో ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది..’ అని స్పష్టం చేశారు. 

రాబోయే దశాబ్దంలో హైదరాబాద్‌ను పునర్నిర్మించే భారీ వ్యూహంతో తమ ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీ, మెట్రో విస్తరణ , మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులను చేపట్టిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు  సభలో మాట్లాడారు.  హైదరాబాద్‌ అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌  టెక్నాలజీ సెంటర్‌ గా అభివృద్ధి చెందుతుందని,  ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న భవిష్యత్తు నగరంగా మారుతుందని అన్నారు.

హైదరాబాద్‌ తో  పాటు  టైర్‌ 2 పట్టణాల్లోనూ ఐటీ సేవా రంగాలను వృద్ధి చేయటంతో పాటు తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత పాటిస్తున్నామని మంత్రి చెప్పారు. రాబోయే దశాబ్దంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్‌ డాలర్ల  ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా ఎంచుకున్నారని, ఈ వృద్ధిని సాధించేందుకు అందరూ కలిసిరావాలని శ్రీధర్‌ బాబు పిలుపునిచ్చారు. 

అమెరికాలోని అన్ని ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల గొంతుకగా.. ఈ అలయెన్స్‌ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది చివర్లో వేగాస్‌లో ఐటీ సర్వ్‌ అలయెన్స్‌ తమ వార్షిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షులు సహా పలువురు పేరొందిన లీడర్లు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ డబ్ల్యూ బుష్‌, హిల్లరీ క్లింటన్‌, స్టీవ్‌ ఫోర్బ్స్‌ లాంటి ప్రపంచ దిగ్గజాలు హాజరవుతారు. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని అలయెన్స్‌ ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డిని ఆహ్వానించారు.

 

Click here for Photogallery

 

 

Tags :