హర్యానాలో కమలం తీన్మార్..
హర్యానాలో కమలం హ్యాట్రిక్ సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ.. విజయ భేరీ మోగించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ .. 48 స్థానాల్లో కమలం విజయం సాధించింది. కాంగ్రెస్ 37, ఐఎన్ఎల్డీ 3 ఇతరులు రెండు స్థానాల్లో విజయ దుంధుబి మోగించారు. దీంతో మరోసారి నయాబ్ సింగ్ సైనీకి పగ్గాలు అప్పగించనుంది బీజేపీ. ఈ విజయంపై ప్రధాని మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. తమపై నమ్మకం ఉంచి మూడోసారి పట్టం కట్టిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు.. ఈ ఫలితాలపై కాంగ్రెస్ మాత్రం అనుమానాలు వ్యక్తం చేసింది. పార్లమెంటరీ ఎన్నికల్లో సీట్లు తగ్గడంతో అప్రమత్తమైన మోడీ-షా ద్వయం.. తమ రాజకీయ చతురతకు పదునుపెట్టింది .సామాజిక ఇంజినీరింగ్ దగ్గర నుంచి నేతల ఎంపిక, ప్రచారం వరకూ అన్ని ముందుండి నడిపించింది. రాష్ట్రంలో జాట్ వర్గీయులు.. కాంగ్రెస్ వైపు మళ్లడం, దీనికి తోడు రెజ్లర్ల పోరాటం వెరసి... తమకు ఇబ్బందులు తప్పవని బీజేపీ భావించింది. దీంతో బలమైన ఓబీసీ వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు నాయబ్ సింగ్ సైనీకి.. సీఎం పదవి అప్పజెప్పింది. దీంతో పోరాటం కాస్త జాట్ వర్సెస్ ఇతరులు అన్నట్లుగా సాగింది.
ఈ ఫలితాల్లో బీజేపీ గెలుపు సాధించింది. అగ్రకులాలు, పంజాబీలపైనే బీజేపీ ఫోకస్ పెట్టింది. బ్రాహ్మణ వర్గానికి చెందిన మోహన్ లాల్ బదోలికి పార్టీ పగ్గాలు అప్పజెప్పింది. రాష్ట్రంలో 7.5 శాతం ఓట్లు ఉండడంతో.. వీరికి 11 స్థానాల్లో అవకాశం కల్పించింది. గత రెండు ఎన్నికల్లోనూ ఈ వర్గం బీజేపీ వెన్నంటే నిలిచింది. దీనికి తోడు 24 పంటలకు ఎంస్పీ ప్రకటించడం ద్వారా.. రైతు ఆందోళనల తీవ్రతను తగ్గించడంలో విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేకతకు కళ్లెం వేసేలా ముఖ్యమంత్రి ఖట్టర్ ను మార్చేసింది.
అంతే కాదు సగానికి పైగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించింది. ఫలితంగా కొంతవరకూ ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించడంలో విజయం సాధించింది. బీజేపీకి ఈసారి అహిర్వాల్ బెల్ట్ అండగా నిలిచింది.గురుగ్రామ్, రేవరి, మహేంద్రగడ్ ప్రాంతాలకు సంబంధించి 28 స్థానాలు ఈబెల్ట్ కిందకు వస్తాయి.గత ఎన్నికల్లోనూ ఈ బెల్ట్ .. కాషాయదళాన్ని ఆశీర్వదించింది. దీంతో ఇతర ప్రాంతాల్లో సీట్లు తగ్గినా.. ఈప్రాంతం బీజేపీని నిలబెడుతూ వస్తోంది.