ఇజ్రాయెల్ కాచుకో..... ఓటమి చవిచూపిస్తాం...ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ భీషణ ప్రతిజ్ఞ
పశ్చిమాసియాలో ఉద్రికత్తలు నెలకొన్న వేళ ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపించి మరింత ఆజ్యం పోసిన ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ..ఐదేళ్ల తర్వాత తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. టెహ్రాన్లో ఏర్పాటు చేసిన హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా సంస్మరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇజ్రాయెల్పై మిసైల్ దాడులను సమర్థించుకున్న ఆయన... లెబనాన్, పాలస్తీనాలో జరుగుతున్న పోరాటాలకు మద్దతు ప్రకటించారు.
శత్రువుల పప్పులు ఉడకనివ్వబోమని ప్రతినబూనారు. నస్రల్లా మరణం తనను తీవ్రంగా బాధించిందన్నారు. హమాస్, హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ విజయం సాధించలేదని తేల్చి చెప్పారు ఖమేనీ. నస్రల్లా మనమధ్య లేనప్పటికీ ఆయన మార్గం మాత్రం ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని తెలిపారు. ఆయన బలిదానం వృథా కాదు. శత్రువుల ప్రణాళికలను తిప్పికొట్టి.. వారిని ఓడించి తీరుతాం. శత్రువులకు వ్యతిరేకంగా మనమందరం ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు.
లెబనీస్, పాలస్తీనియన్ల ఆక్రమణకు వ్యతిరేకంగా నిలబడిన తమపై అభ్యంతరం, నిరసన తెలిపే హక్కు ఏ అంతర్జాతీయ చట్టానికి లేదని స్పష్టం చేశారు. ఎప్పుడైతే నస్రల్లాను ఇజ్రాయెల్ మట్టుపెట్టిందో.. ఖమేనీని ఇరాన్ దళాలు సురక్షితప్రాంతానికి తరలించాయి. ఇప్పుడు.. నస్రల్లా అంతిమయాత్ర సందర్భంగా ... ప్రజలను ఉద్దేశించి ఖమేనీ ప్రసంగించారు. ఖమేనీ ప్రసంగంతో ... ఈయుద్ధం మరింత సుదీర్ఘ కాలం కొనసాగుతుందన్న అంచనాలున్నాయి. ఎందుకంటే.. ఇరాన్ ఇప్పుడు తన వైఖరిని మరింత ధృడంగా తేల్చి చెప్పింది.
దీనికి ఇజ్రాయెల్ సైతం ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇరువైపులా దాడులు జరుగుతున్నప్పుడు.. ఇక శాంతి అనే మాట వినబడే పరిస్థితి ఉండదు. గతంలో సుదీర్ఘకాలం యుద్ధం చేసిన అనుభవం ఇరాన్ కుంది. ఇరాక్ తో సుదీర్ఘంగా యుద్ధం చేసింది ఇరాన్. అన్నాళ్లు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా యుద్ధం కొనసాగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ తో మొదలు పెట్టిన యుద్ధం కూడా ఇదే పంథాలో వెళ్తుందన్న అంచనాలున్నాయి. అయితే.. ఈయుద్ధం ప్రభావంతో .. ప్రపంచదేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వాటిల్లుతున్నాయి.