వీనులవిందు చేసిన కవితా చక్ర బృందం సంకీర్తనలు
పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా "నాదబ్రహ్మోత్సవ్- 2024" ను వైభవోపేతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే! కార్యక్రమంలో భాగంగా రెండవరోజు అక్టోబర్ 5 వ తేదీన కవితా చక్ర మరియు బృంద గాయకులు నిరంజని, శివరంజని, అభిక్య తనికెళ్ళ, వినీల్ మరియు కిషోర్ ఆలపించిన నీకథామృతము, చూడరమ్మ సతులాల, తందనాన అహి, తిరుమలగిరిరాయ వంటి అన్నమాచార్య సంకీర్తనలతో అలరించారు. కీబోర్డ్ తో రాజు తబలాతో అజయ్ వాద్యసహకారం అందించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు తనికెళ్ళ భరణి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. గౌరవ అతిథిగా పద్మజ నాయుడు విచ్చేశారు.
కార్యక్రమంలో భాగంగా ప్రముఖ దంత వైద్యులు డా .సునీత నల్లూరికి "దరహాస శిల్పిని" బిరుదుని, డా. రామకృష్ణ నల్లూరికి "దంత ధన్వంతరి" బిరుదుని వారి సేవలకు గుర్తుగా ప్రదానం చేశారు. గౌరవ, ముఖ్య అతిథులు పద్మశ్రీ డా.శోభారాజు చేస్తున్న నాదబ్రహ్మోత్సవ్ కార్యక్రమాలను, అన్నమాచార్య భావనా వాహిని సంస్థ చేస్తున్న సమాజహితమైన సేవలను కొనియాడారు. అనంతరం తీర్థప్రసాద వితరణతో ఈరోజు కార్యక్రమం ముగిసింది.